శాంతంతో అన్నీ సాధ్యమేనని , కోపంతో అన్నీ ఇబ్బందులేనని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ అన్నారు. శ్రీశైలంలో అర్ధనారీశ్వర తత్త్వంపై పద్మాకర్ ప్రవచనాలు సోమవారంతో ముగిసాయి. శ్రీశైలం కరుణ శైలమని ఇక్కడ భక్తితో సేవిస్తే స్వామి అమ్మవార్ల అనుగ్రహం లభిస్తుందన్నారు. భీముడు ఈ క్షేత్రంలో దర్శనానికి వచ్చినప్పుడు ఆకలి తీరడానికి శివస్తోత్రం చేశాడని , అమ్మవారు కిరాత స్త్రీ రూపంలో దర్శనం ఇచ్చి ఆహారం పెట్టిందని బ్రహ్మశ్రీ పేర్కొన్నారు. భీముడు కడుపునిండా తిని అమ్మ ఆజ్ఞపై శివలింగాన్ని ప్రతిష్టించాడని , ఆ లింగాన్ని దర్శించినవారికి జీవితంలో ఆహారానికి లోటు ఉండదని వివరించారు. అర్జునుడికి పాశుపతం ఇచ్చింది అర్ధనారీశ్వరుడని పేర్కొన్నారు.శ్రీశైలంలో బిల్వ మొక్కలను నాటినవారికి ప్రమధగణాలలో చోటు లభిస్తుందన్నారు. బ్రహ్మశ్రీ పద్మాకర్ గత వారం రోజుల ప్రవచనంలో శివతత్త్వం , శివలీలవైభవం , శివరూప విశేషాలు , దేవీతత్త్వం , దేవీమహాత్యం , శ్రీశైల క్షేత్ర మహిమలు తదితర విశేషాలు పేర్కొన్నారు. ఈ ప్రవచనం ఘనంగా ముగిసిన గుర్తుగా దేవస్థానం వారు , అభిమానులు బ్రహ్మశ్రీ పద్మాకర్ ను ఘనంగా సన్మానించారు.