రాష్ట్రంలో 2400 పైగా ఏఈఓల ద్వారా ట్యాబుల సహాయంతో గ్రామాలలో రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ, రైతుల గ్రూప్ ఇన్సూరెన్స్ వివరాల సేకరణ విజయవంతంగా అమలు చేస్తున్నందుకు వ్యవసాయ శాఖను అభినందిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్ కె.జోషి తెలిపారు. మంగళవారం సచివాలయంలో తెలంగాణ డాష్ బోర్డు, మున్సిపాలిటీలలో కార్పోరేషన్లు చేపడుతున్నఅభివృద్ధి పనులు,ఓడిఎఫ్ తదితర అంశాలపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖాధికారులతో సమీక్షించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్ లో ముఖ్యకార్యదర్శులు అర్వింద్ కుమార్, శాలినీ మిశ్రా, పార్ధసారధి, కార్యదర్శులు నవీన్ మిత్తల్, జగధీశ్వర్, బుద్ధప్రకాశ్ జ్యోతి, బెన్ హర్ మహేష్ దత్ ఎక్కా, మెట్రోవాటర్ వర్క్స్ యం.డి. దానకిషోర్, పంచాయతీ రాజ్ శాఖ కమీషనర్ నీతుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సి.యస్ మాట్లాడుతూ క్షేత్ర స్ధాయిలో వివిధ శాఖల సిబ్భంది వద్ద అందుబాటులో ఉన్న ట్యాబులు, ఐపాడ్స్, సాఫ్ట్ వేర్ సమస్యలపై బేసిక్ సర్వేను నిర్వహించాలని కలెక్టర్లను కోరారు. గ్రామాలలో వ్యవసాయ,ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమం, బి.సి వెల్ఫేర్, రెవెన్యూ, తదితర శాఖల ద్వారా వివిధ అంశాలకు సంబంధించి సమాచారం సేకరిస్తున్న పద్ధతులపై సమీక్షించారు. రైతుబంధు పథకాన్ని వ్యవసాయ శాఖ ద్వారా ఏఈఓలు ట్యాబుల సహాయంతో పర్యవేక్షిస్తున్నదని తెలుపుతూ కెసిఆర్ కిట్స్, MMR / IMR పర్యవేక్షణ, ఆరోగ్య లక్ష్మీ, స్కాలర్ షిప్ ల పంపిణీ, షాధీముబారక్, కళ్యాణ లక్ష్మీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్ధుల అడ్మిషన్లు, వారి ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలకు సంబంధించి సేకరించే సమాచారం కలెక్టర్లు పర్యవేక్షించడంతో పాటు సంబంధిత కార్యదర్శులు సమీక్షించేలా డ్యాష్ బోర్డు రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు.
మున్సిపల్ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ మాట్లాడుతూ 2016-17, 2017-18 ఆర్ధిక సంవత్సరాలకు సంబంధించి రామగుండం, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ తదితర మున్సిపల్ కార్పోరేషన్లలో ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిందని, వీటి పనుల్లో వేగం పెరగాలని ఈ అంశాలపై ప్రతి 15 రోజుల కొకసారి జిల్లా కలెక్టర్లు మున్సిపల్ కమీషనర్లతో సమీక్షించాలని కోరారు.
కేంద్రప్రభుత్వ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ మాట్లాడుతూ టాయిలేట్ల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రతిభ చూపుతోందని 86 శాతం కవరేజ్ సాధించారని , అక్టోబర్ 2 నాటికి రాష్ట్రమంతా ఓడిఎఫ్ లక్ష్య సాధన దిశగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే 12 జిల్లాలు ఓడిఎఫ్ సాధించాయని, వచ్చే మూడు నెలల్లో మిగతా జిల్లాలు పనులు సాగించి ఓడిఎఫ్ ను సాధించాలని కలెక్టర్లను కోరారు. టాయిలెట్ల నిర్మాణానికి సంబంధించి కేంద్రం త్వరలోనే నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. టాయిలేట్ల నిర్మాణంలో వెనుకబడ్డ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు