
*Mouli, Machilipatnam*
అక్షరమే ఆయుధంగా సమాజ ఉద్ధరణకు తమ వంతు పాత్ర నిర్వహించాలిసిన బాధ్యత విలేకరులది. ఇందుకు విరుద్ధంగా కొందరు ఈ వృత్తిని అడ్డం పెట్టుకుని బెదిరింపులు , ఇతర జుకుప్సాకరమైన పద్దతులు ఎన్నుకుని ఏకంగా ఈ వృత్తికే కళంకం తీసుకువస్తున్నారు. ఇలాంటి ఉదంతమే కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది . చెడు అలవాట్లకు లోనైన ఒక రైతును బ్లాక్మెయిల్ చేస్తున్న నలుగురు వ్యక్తులను కృష్ణాజిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ముగ్గురు విలేకరులు కావడం గమనార్హం . చల్లపల్లి సీఐ జనార్ధన్ అందించిన వివరాలు ఇవి . ఓ వ్యక్తికి మత్తుమందు ఇచ్చి వస్త్రాలు తొలగించి దారుణంగా వ్యవహరించగా ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన మరొక వ్యక్తి వీడియో తీసి, ఆ రైతును బ్లాక్ మెయిల్ చేసారు . ఇందులో భాగంగా కాజేసిన వజ్రాల ఉంగరం, బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమమీద ఫిర్యాదు చేస్తే ఫోటోలు, వీడియోలు కూడా యూట్యూబ్ లో పెడతామని వారు బెదిరించి, పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. స్ధానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆరా తీసారు. బ్లాక్ మెయిల్ చేసిన ముగ్గురు ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు పైన, బ్లాక్ మెయిల్ కు సహకరించిన మరొక వ్యక్తి పైన కేసులు నమోదు చేయాలని స్ధానికులు పలువురు డిమాండ్ చేసారు . బ్లాక్ మెయిల్ కు పాల్పడిన ఆ నలుగురిని స్ధానికులు చాకచక్యంగా పట్టుకుని పొలీసులకు అప్పజెప్పారు. కాగా ఇలాంటి వారితో ఏదోవిధంగా సంబంధం ఉన్న పలుకుబడి ఉన్న వారు జోక్యం చేసుకుని ఆ నలుగురిని వదిలివేయాలని ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. స్ధానికులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వీరిని వదలరాదని చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన విజయవాడ రిపోర్టరు, మచిలీపట్నంకు చెందిన మరొక రిపోర్టరు తోసహా ముగ్గురు రిపోర్టర్లు గతంలో ఇదే తరహా బెదిరింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒక రిపొర్టరు రెండు నెలల క్రిందట ఒక ఛానెల్ నుంచి మరో ఛానెల్ కు వచ్చినట్టు తెలుస్తోంది . నిందితులను మచిలీపట్నం కోర్టు రిమాండు కు పంపింది . మరో ఇద్దరు పరారిలో ఉన్నట్లు తెలుస్తోంది .