రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాసు పుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీపై పర్యవేక్షణకై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు ఆయా జిల్లా కలెక్టర్లతో అన్ని గ్రామాలకు సంబంధించి తగు కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఉన్నతాధికారులను ఆదేశించారు.శుక్రవారం సచివాలయంలో జిల్లాలలో పట్టాదారు పాసుపుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీ పై అనుసరించాల్సిన వ్యూహంపై ప్రత్యేక అధికారులతో సమీక్షించారు.
జిల్లాలకు నియమించిన ప్రత్యేక అధికారులు ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించుకొని జిల్లాల్లో పర్యటించి రైతులకు పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీ సజావుగా జరిగేలా కలెక్టర్లకు మార్గనిర్ధేశం చేయాలన్నారు. జిల్లాల్లో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామాలలో పర్యటించి సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. మండల అధికారుల టీంలు ప్రతి గ్రామంలో పర్యటించేలా చూడాలన్నారు. పాసుపుస్తకాలలోని తప్పులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని సరిదిద్దేలా చూడాలన్నారు. జిల్లాలకు కేటాయించిన మంత్రులతో సమన్వయం చేసుకొని స్పెషల్ డ్రైవ్ తో కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. గ్రామాలలో నెలకొన్న సమస్యను అధ్యయనం చేయాలన్నారు. ఇప్పటికే పంపిణీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలు,చెక్కులపై సమీక్షించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 57.33 లక్షల ఖాతాలు క్లియర్ గా ఉండగా ఇప్పటివరకు దాదాపు 40 లక్షలు పాసుపుస్తకాలు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో మిగిలిన పాసు పుస్తకాల పంపిణీకి సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. ఆధార్ అనుసంధానించిన ఖాతాలకు డిజిటల్ సిగ్నేచర్లను సత్వరం పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే ముద్రించిన పాసుపుస్తకాలలో కొన్ని పట్టాదార్ల పేర్లు తప్పుగా రావడం, పట్టాదారు చనిపోవటం, అమ్మకాలు జరగడం, ఫోటోలు తప్పుగా పడటం, విస్తీర్ణం తక్కువ, ఎక్కువగా నమోదు కావడం,అటవీ వివాదాలు తదితర అంశాలతో కొన్ని పాసుపుస్తకాలలో వివరాలు సరిగా నమోదు కాలేదని, వీటిని సరిదిద్దే విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కొందరు తమ ఆధార్ వివరాలు ఇవ్వనందున పాసుపుస్తకాలు ముద్రించలేదని, మరికొందరు ఆధార్ సమర్పించినప్పటికి ఫోటోలు లేవని, పంపిణీ సందర్భంగా కొందరు సమర్పించారని వాటికి డిజిటల్ సంతాకాలు చేసి పంపిణీకి చర్యలు చేపట్టేలా చూడాలన్నారు. జిల్లాలలో రైతు బంధు చెక్కులను నగదుగా మార్చుకొనేందుకు బ్యాంకులలో అందుతున్న నగదుపై దృష్టి సారించడంతో పాటు మిగిలిన చెక్కుల పంపిణీకి తగు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. చెక్కులు, పాసుపుస్తకాలు పంపిణీలో నాణ్యత పెరిగేలా తగు సూచనలు అందించాలన్నారు. జూన్ 20 వరకు ఈ కార్యక్రమం పూర్తి అయ్యేలా చూడాలన్నారు.
ఈ సమావేశంలో ప్రత్యేక ఆధికారులుగా నియమితులైన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు అజయ్ మిశ్రా, శ్రీమతి చిత్రారామచంద్రన్, ముఖ్యకార్యదర్శులు అధర్ సిన్హా, సునీల్ శర్మ, రామకృష్ణారావు, సోమేశ్ కుమార్, వికాస్ రాజ్, జయేష్ రంజన్, శివశంకర్, శశాంక్ గోయల్, కార్యదర్శులు, శ్రీమతి శ్రీలక్ష్మి, సందీప్ కుమార్ సుల్తానియా, బుధ్ద ప్రకాశ్ జ్యోతి, శ్రీమతి అనితా రాజేంద్ర, మాణిక్ రాజ్, పంచాయతీ రాజ్ కమీషనర్ శ్రీమతి నీతూ ప్రసాద్, హెచ్ ఎండిఏ కమీషనర్ చిరంజీవులు, సింగరేణి సి.యం.డి శ్రీధర్, గిరిజిన సంక్షేమ శాఖ కమీషనర్ క్రిస్టినా జడ్ చొంగ్తు తదితరులు పాల్గొన్నారు.