విజయవాడ: ప్రజా పంపిణీ వ్యవస్థలో సరికొత్త చరిత్రకు సీఎం వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వేదికగా రేషన్ డోర్ డెలివరీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు రేషన్ బియ్యం పంపిణీ బ్యాగులను సీఎం వైయస్ జగన్ ఆవిష్కరించారు. పాదయాత్రలో కూలీలు, వృద్ధులు, రోగుల కష్టాలను చూసిన వైయస్ జగన్.. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే రేషన్ సరుకుల సరఫరా వాహనాలను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వాహనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి 2,500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలను సీఎం ప్రారంభించారు. మిగిలిన జిల్లాల్లో ఆయా జిల్లాల మంత్రులు రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన రేషన్ బియ్యం డోర్ డెలివరీ చేయనున్నారు. లబ్ధిదారులకు నాణ్యమైన, మెరుగుపరచిన బియ్యాన్ని ఇంటివద్దే అందచేసేందుకు ఏటా రూ.830 కోట్లను సీఎం వైయస్ జగన్ సర్కార్ అదనంగా వెచ్చిస్తుంది.