హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్రెడ్డి గెలుపును కాంక్షిస్తూ రూపొందించిన ‘రావాలి జగన్.. కావాలి జగన్’ ప్రచార గీతం రికార్డులు సృష్టిస్తోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఈ గీతం.. సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతూ, సంచలనం రేపుతోంది. దేశ రాజకీయ చరిత్రలో ఒక పార్టీ ప్రచారగీతం ఈ స్థాయిలో ఆకర్షించడం రికార్డు అంటున్నారు. ఇప్పటికే ఈ పాటకు వస్తున్న ఆదరణపై జాతీయ ఆంగ్ల చానెళ్లు సైతం ప్రత్యేక కథనాలను ప్రసారం చేసాయి .
సినీ రచయిత సుద్దాల అశోక్తేజ రచించిన ఈ పాటకు ఫిదా చిత్ర సంగీత దర్శకుడు శక్తికాంత్ కార్తీక్ సంగీతం సమకూర్చగా.. గాయకుడు మనో ఆలపించారు. విడుదలైన అనతికాలంలో ఈ పాట విపరీతంగా జనసామాన్యంలోకి వచ్చేసింది. ముఖ్యంగా యువతీయువకుల నోళ్లల్లో ఈ పాట నానుతూ ఓ కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ఒక్క ఏపీలోనే కాక.. పొరుగు రాష్ట్రాల్లోని వైయస్ జగన్ అభిమానులను సైతం ఈ ప్రచార గీతం విశేషంగా ఆకట్టుకుంటోంది.