అమరావతి, జులై 5 : రాష్ట్రంలోని రహదారులపై ఎక్కడా గుంతలు వుండకూడదని, ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రహదారుల పక్కన వున్న పిచ్చిమొక్కలను, పొదలను తొలిగించాలని, వర్షాకాలంలో నీరు నిలిచిపోయి రోడ్లు పాడవ్వకుండా అవసరమైన చోట్ల డ్రైనేజీలు నిర్మించాలని అన్నారు. సీసీ కెమేరాలతో రహదారుల నిర్మాణం పర్యవేక్షించి, డ్రోన్ కెమేరాలు, స్మార్ట్ ఫోన్ల ద్వారా వాటి స్థితిగతులు పరిశీలించాని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమాచారాన్ని వినియోగించుకొని రహదారుల నిర్వహణను సమర్ధవంతంగా చేపట్టాలని అన్నారు. గురువారం ఉండవల్లి తన నివాసంలోని గ్రీవెన్స్ హాల్లో రహదారులు, భవనాల శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అన్ని రహదారుల ప్రాజెక్టులను నిర్ణీత కాలానికి పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. వేగంగా రోడ్ల నిర్మాణం పూర్తి చేయడంతో పాటు, వాటి నాణ్యతకు పెద్దపీట వేయాలని చెప్పారు. రహదారుల నిర్మాణంలో అలసత్వం ప్రదర్శించే నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకుంటామని, నిర్దేశిత సమయానికి రోడ్ల నిర్మాణం చేయని సంస్థలను బ్లాక్లిస్టులో పెడతామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
ఏపీఆర్ఎంఎస్ క్రింద 42 వేల కిలోమీటర్ల మేర వున్న రాష్ట్ర రోడ్ నెట్వర్క్కు సంబంధించిన సమాచారాన్ని ఆర్డీబీఎంఎస్ సాఫ్ట్వేర్లో క్రోడీకరించామని అధికారులు చెప్పారు. డ్రోన్లను వినియోగించుకుని రహదారుల నిర్వహణ ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. తన పరిశీలనలో గుంతలు కనిపిస్తే అధికారులను సస్పెండ్ చేయడానికి కూడ వెనుకాడనని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ప్రమాదాలకు ఆస్కారం లేని రహదారులుగా రాష్ట్ర రహదారులు ఉండాలని, ముఖ్యమంత్రి చెప్పారు.
రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారుల మొత్తం 53,403 కి.మీ. పొడవున వున్నాయని, వీటిలో జాతీయ రహదారులు 6,401 కి.మీ. రాష్ట్ర రహదారులు 13,604 కి.మీ., ప్రధాన జిల్లా రహదారులు 32,280 కి.మీ. అని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. 2021 కల్లా గ్రామీణ రహదారులన్ని బీటీ రోడ్లుగా మార్చాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇందులో బాగంగా సుమారు రూ.1550 కోట్ల వ్యయంతో 1810 కిలోమీటర్ల మేర మట్టి రోడ్లు తారు రోడ్లుగా మారనున్నాయి.
ప్రధాన జిల్లా రహదారుల్లో 91% గుంతలు లేకుండా మెరుగు పరిచామని చెప్పారు. రహదారుల కోసం రూ. 4,472 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. రోడ్ అంబులెన్స్ ఏర్పాటు చేసి మిగతా 9 శాతం కూడా గుంటలు లేకుండా చేయాలని సూచించారు. ఆగష్ట్ 15 నాటికి 100 శాతం లక్ష్యం చేరుకోవాలని ఆదేశించారు.
గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, మండల కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు రహదారులను త్వరితగతిన అనుసంధానించడం. వచ్చే ఐదేళ్లలో నాలుగు వేల కి.మీ. ప్రధాన జిల్లా రహదారుల విస్తరణ చేపట్టడం. శిధిలావస్థకు చేరిన 120 వంతెనలను పునర్నిర్మించడం. రహదారి భద్రతా చర్యల్లో భాగంగా, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని రహదారుల నిర్వహణ చేపట్టడం. 2021-22 కల్లా రాష్ట్రంలోని 1,810 కి.మీ రహదారులను రూ. 1,580 కోట్లతో బీటీ రోడ్లుగా అభివృద్ధి చేయడం. ఈ ఏడాది రూ. 500 కోట్లతో 570 కి.మీ. బీటీ రహదారులు నిర్మించాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులకు లక్ష్యాలను నిర్దేశించారు.
విజయవాడలో కనకదుర్గ ప్లయ్ఓవర్ 70% శాతం పూర్తయ్యిందని అధికారులు వివరించగా, ప్రతినెలా పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టు ఇది, వచ్చే సంక్రాంతి కల్లా ఫ్లయ్ఓవర్ నిర్మాణం చేస్తే అందరూ సంతోషిస్తారని అన్నారు. ఎట్టి పరిస్తితుల్లోనూ వచ్చే ఏడాది జనవరి 26 నాటికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఇకపై ప్రతి సోమవారం నిర్మాణ పనుల పురోగతిని సమీక్షిస్తానని చెప్పారు. నిర్మాణంలో జాప్యాన్ని సహించేది లేదన్నారు.
సమీక్షలో రహదారులు, భవనాల శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్యమంత్రి కార్యదర్శి ఎ.వి. రాజమౌళి, రహదారులు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పాల్గొన్నారు.