
శ్రీశైల దేవస్థానం:ఈ సంవత్సరం శ్రీశైల దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 04.03.2021 నుండి 14.03.2021 వరకు 11 రోజులపాటు జరుగుతాయి.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు ఈ రోజు (09.02.2021) న కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామ రావు దేవస్థానం యూనిట్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, పర్యవేక్షకులు, ప్రధానార్చకులతో ప్రాథమిక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశం లో స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వి.రమణ, మండల ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారి డా. సోమశేఖరయ్య, దేవస్థానం వైద్యశాల వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
సమావేశ ప్రారంభంలో కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ జిల్లాయంత్రాంగ సహాయ సహకారాలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది అందరు కృషి చేయాలని సూచించారు.ముఖ్యంగా ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించవలసి ఉంటుందన్నారు. ఈ విషయమై భక్తులు మాస్కులు ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం, తరచుగా చేతులను శానిటైజేషన్ చేసుకోవడం లాంటి అంశాలపై భక్తులలో మరింత అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసమై త్రపరిధిలో విరివిగా ఫ్లెక్సీబోర్డులను ఏర్పాటు చేయడం, కరపత్రాలను అందుబాటులో ఉంచడం, దేవస్థాన ప్రసారవ్యవస్థ ద్వారా తరుచుగా తెలియజెబుతుండడంలాంటి చర్యలు చేపట్టాలన్నారు.దేవస్థానం అన్ని విభాగాలు కూడా సమిష్టిగా పరస్పర సమన్వయంతో ఉత్సవ నిర్వహణలో విధులు నిర్వహించాలన్నారు.
మహాశివరాత్రికి వచ్చే భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు ఆరుబయలు ప్రదేశాలలో పైప్ పెండాల్స్, షామియానాలు మొదలైన వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కార్యనిర్వహణాధికారి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.క్యూకాంప్లెక్స్, క్యూలైన్ల లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా దర్శనానికి వేచివుండే భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం మొదలైన వాటిని అందజేయాలన్నారు.అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ప్రజాసౌకర్యాలకు (మూత్రశాలలు మరియు మరుగుదొడ్లు) అవసరమైన అన్ని మరమ్మతులు చేసి అన్నింటిని కూడా వినియోగంలోకి వచ్చే విధంగా తగు ఏర్పాట్లు చేయాలన్నారు.క్షేత్ర పరిధిలో అవసరమైన చోట్ల అదనపు కుళాయిలను ఏర్పాటు చేయాలన్నారు. స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా క్షేత్రపరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు.
హరిహరరాయగోపురం వద్ద ఉత్సవ సమయంలో తాత్కాలిక క్యూలైన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. పార్కింగ్ ఏర్పాట్లు, సామానులు భద్రపర్చుగది, ట్రాఫిక్ నియంత్రణ మొదలైన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని కార్యనిర్వహణాధికారి అన్నారు.అనంతరం సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వి. రమణ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో చేయవలసిన బందోబస్తు ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై వివరించారు.తరువాత మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డా. సోమశేఖరయ్య మాట్లాడుతూ వైద్యఆరోగ్యపరంగా చేపట్టవలసిన చర్యలు గురించి వివరించారు.
ఈ నెల 11వ తేదీన కర్నూలులో జిల్లా కలెక్టర్ ఆధ్వర్లోయంలో జరిగే సమన్వయ సమావేశములో ఉత్సవ ఏర్పాట్ల గురించి కూలకుషంగా చర్చించి తదనుగుణంగా ఆయా చర్యలు తీసుకుంటారు.