మత్స్యకారుల జీవతాల్లో వెలుగులు నింపి వారిని ఆర్ధికంగా, సామాజికంగా వృద్ధిలోకి తీసుకురావలన్న దృడ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య,పాడిపరిశ్రమాభివృద్ధి మరియు సినిమాటోగ్రఫి శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
బుధవారం సచివాలయంలో మత్స్యశాఖ అధికారులు, మత్స్యసహకార సంఘాల అధ్యక్షులు, సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారికే చేయూత నివ్వాలనే ఉద్ధేశ్యంతోనే రిజర్వాయర్లు,చెరువులు, కుంటలల్లో చేపపిల్లలను విడుదల చేసి, పెంపకానికి కృషి చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కుల వృత్తులపై ఆధారపడి జీవించే వారిని సామాజికంగా ఆర్ధికంగా వృద్ధిలోకి తీసుకురావాలన్న ఉద్ధేశ్యంతో ఈ సారి బడ్జెట్ లో మత్స్యశాఖ అభివృద్ధికి 101 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4553 చెరువులు ఉండగా ఇప్పటివరకు 1137 చెరువులలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం పూర్తయ్యిందని 30 కోట్ల చేపపిల్లలు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 9 కోట్ల చేపపిల్లలు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. మిగతా లక్ష్యాన్ని నవంబర్ మాసాంతానికి పూర్తి చేయాల్సిందిగా జిల్లా స్ధాయి అధికారులను ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని ఆయా జిల్లాల వారిగా చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సమీక్షీంచేందుకు మత్స్య శాఖ కేంద్ర కార్యలయం నుండి ముగ్గురు డిప్యూటి డైరెక్టర్ స్ధాయి అధికారులను పర్యవేక్షణ అధికారులుగా నియమించినట్లు మంత్రి తెలిపారు. సొసైటీ సభ్యులతో పాటు ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారన్నారు. ఆయా జిల్లాలలో ఉన్న సొసైటీలో సభ్యులు కాని వారిని మత్స్యకారులను సొసైటీలో భాగస్వామ్యం కల్పించేందుకు ఆయా మండలాల వారిగా, జిల్లాల వారిగా సమావేశాలు నిర్వహించి స్పెషల్ డ్రైవ్స్ చేపట్టాలని మత్స్య శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
చేపలను విదేశాలకు ఎగుమతి చేసే స్ధాయికి ఎదగాలని మత్స్యసంఘాలకు ఆయన సూచించారు. చేపల పెంపకంలో సహకార సంఘాలు చురుకుగా పనిచేయాలని ఆయన సూచించారు. ఆయా ప్రాంతాలలో స్ధలాల లభ్యతను బట్టి చేపల మార్కేట్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
దళారీల వ్యవస్ధ లేకుండా చేపపిల్లల పెంపకం ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా మత్స్య సంఘాలకు లభించాలన్నది ప్రభుత్వ ఉద్ధేశ్యమని మంత్రి తెలిపారు. చేపల కోసం కోల్డ్ స్టోరేజీ యూనిట్లను కూడా నిర్మించే ఆలోచన ఉందన్నారు.
తెలంగాణ పల్లెలు మరింతగా స్వయం సమృద్ధి సాధించి బంగారు తెలంగాణకు బాటలు వేసే దిశగా చేపల పెంపకం కార్యక్రమం సాగాలని మంత్రి ఆకాంక్షించారు. అందరి సహకారంతో చేపల పెంపకం కార్యక్రమాన్ని ముందుకు తీసుకవెళ్ళాలని మంత్రి సూచించారు.
ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ సురేష్ చందా, కమీషనర్ శ్రీ వెంకటేశ్వర్లు, మత్స్యసహకార సంఘాల అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.