పిల్లలకు యోగా సాధన ప్రోత్సహిస్తే వారిలో ప్రతిభా పాఠవాలు, ఆరోగ్యం మెరుగు

యోగా సాధనతో నాణ్యమైన జీవనం : గవర్నర్

ఎక్కువ కాలం జీవించడం ముఖ్యం కాదని, ఎక్కువ కాలం ఆరోగ్యంగా నాణ్యమైన జీవనం గడపడం ముఖ్యమని యోగా ద్వారానే నాణ్యమైన జీవనం సాధ్యమని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు.

ఈరోజు సాయంత్రం రాజ్ భవన్ నుండి యోగా సప్తాహ్ – 2020 కార్యక్రమాన్ని ఆన్ లైన్ లో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు.

గవర్నర్ మాట్లాడుతూ ఐదు వేల సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగిన యోగా ద్వారా సంపూర్ణ మానసిక, శారీరక, ఆధ్యాత్మక ఆరోగ్యాన్ని సాధించవచ్చని ఆమె తెలిపారు.

స్వయంగా గైనకాలజిస్ట్ అయిన గవర్నర్ డాక్టర్ గా తన అనుభవాన్ని వివరిస్తూ అనేకమంది గర్భిణీ స్త్రీలు యోగా సాధన ద్వారా సిజేరియన్ సర్జరీలు అవసరం లేకుండా కాన్పులు అయ్యేవారని తెలిపారు. యోగా కూడా ఒక డాక్టర్ లాగానే సాధకుల ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లలకు యోగా సాధన ప్రోత్సహిస్తే వారిలో ప్రతిభా పాఠవాలు, ఆరోగ్యం మెరుగవుతాయని, దాని ద్వారా విద్యలో వారి సామర్ధ్యాలు పెరుగుతాయని గవర్నర్ వివరించారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడి గారి చొరవతో ఐక్యరాజ్య సమితిలో తీర్మానం ద్వారా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మలిచారని, ఇది భారతీయ యోగాకు గొప్ప విజయమని, భారతీయులందరికీ గర్వకారణమని డాక్టర్ తమిళిసై పేర్కొన్నారు.

ఇప్పడు యోగాను గల్ఫ్ దేశాలతో సహా దాదాపు 175 దేశాలలో సాధన చేస్తున్నారని యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారని గవర్నర్ తెలిపారు.

ఈ ఆన్ లైన్ యోగా సప్తాహ్ – 2020 కార్యక్రమాన్ని జూన్ 15 నుండి 21 వ తేదీ వరకు విరాట్ భారత్ అనే సంస్థ నిర్వహిస్తున్నది. ఈ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి, ఆర్.యస్.యస్. తెలంగాణ ప్రాంత ప్రచారక్ దేవేందర్ జీ, ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed