*అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త కేబినెట్ కొలువుదీరింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్లో మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం సచివాలయంలో నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. మొదట నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రులకు గవర్నర్, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఆదిమూలపు సురేష్, మేకపాటి గౌతంరెడ్డిలు ఇంగ్లీష్లో ప్రమాణం చేయగా..మిగిలిన సభ్యులంతా తెలుగులో ప్రమాణం చేశారు. చివరిగా గవర్నర్, ముఖ్యమంత్రితో కొత్త మంత్రుల ఫోటో కార్యక్రమం నిర్వహించారు.
ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు
1. ధర్మాన కృష్ణదాస్ (నర్సన్నపేట)
2. బొత్స సత్యనారాయణ (చీపురుపల్లి)
3. పాముల పుష్పశ్రీవాణి (కురుపాం)
4. అవంతి శ్రీనివాస్ (భీమిలి)
5. పిల్లి సుభాష్చంద్రబోస్ (ఎమ్మెల్సీ)
6. కురసాల కన్నబాబు(కాకినాడ రూరల్)
7. పినిపే విశ్వరూప్ (అమలాపురం)
8. ఆళ్ల నాని (ఏలూరు)
9. తానేటి వనిత (కొవ్వూరు)
10. చెరుకువాడ శ్రీరంగరాజు(ఆచంట)
11. వెల్లంపల్లి శ్రీనివాస్ (విజయవాడ పశ్చిమ)
12. కొడాలి నాని (గుడివాడ)
13. పేర్ని నాని(మచిలీపట్నం)
14. మేకతోటి సుచరిత (ప్రత్తిపాడు)
15. మోపిదేవి వెంకటరమణ ( రేపల్లె )
16. బాలినేని శ్రీనివాస్ రెడ్డి(ఒంగోలు)
17. ఆదిమూలపు సురేష్ (ఎర్రగొండపాలెం)
18. మేకపాటి గౌతంరెడ్డి( ఆత్మకూరు)
19. అనిల్ కుమార్ యాదవ్ (నెల్లూరు సిటీ)
20. నారాయణస్వామి (గంగాధర నెల్లూరు)
21. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (పుంగనూరు)
22. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (కర్నూల్ – డోన్)
23. గుమ్మనూరు జయరాం (ఆలూరు)
24. అంజాద్ భాషా (కడప)
25. మాలగుండ్ల శంకర్ నారాయణ (పెనుకొండ)
* 27 శాతం ఐఆర్, సీపీఎస్ రద్దుపై నిర్ణయం
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగులకు వరాల జల్లు కురిపించారు. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్, సీపీఎస్ రద్దుపై రేపటి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రీవెన్స్ హాల్లో సచివాలయం ఉద్యోగులతో వైయస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం మంచి పాలన అందించాలంటే మీ అందరి సహకారం కావాలని సీఎం కోరారు. ముఖ్యమంత్రులతో సన్నిహితంగా ఉండటం సర్వసాధారణమన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకోవడానికి సన్నిహితంగా ఉంటారన్నారు. గత ప్రభుత్వంలో సన్నిహితంగా ఉన్నారని నేనెవరినీ తప్పుపట్టనని వైయస్ జగన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
* సచివాలయంలోకి అడుగుపెట్టి.. ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరించిన అనంతరం సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి మూడు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆశావర్కర్ల జీతాలను రూ. మూడు వేల నుంచి రూ. 10వేలకు పెంచుతూ.. తొలి సంతకం చేశారు. అనంతరం ఎక్స్ప్రెస్ హైవేకి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ రెండో సంతకం చేశారు. జర్నలిస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ ఫైల్పై సీఎం జగన్ మూడో సంతకం చేశారు.
*జర్నలిస్టుల హెల్త్ ఇన్సురెన్స్కు సంబంధించిన ఫైల్పై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతకం చేయడం పట్ల జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ ఉపాధ్యక్షుడు ఆంజనేయులు తదితరులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
*అవినీతికి ఆస్కారం లేని పారదర్శకమైన పాలన అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, మన పాలన దేశానికే ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి సచివాలయంలో అడుగుపెట్టిన సీఎం వైయస్ జగన్ తన ఛాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం అన్ని శాఖల సెక్రటరీలు, హెచ్ఓడీలతో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారన్నారు. అధికారులపై నాకు పూర్తి విశ్వాసం ఉందని, అధికార యంత్రాంగం సహకారం వల్లే ప్రభుత్వ– ప్రజల కల సాకారం అవుతుందన్నారు. అనవసర వ్యయాన్ని తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేయాలని, మంచి పనితీరు ప్రదర్శించే అధికారులకు సత్కారాలు ఉంటాయన్నారు.
* ఆంధ్రప్రదేశ్ ప్రొటెం స్పీకర్గా శంబంగి చిన్న అప్పలనాయుడు సచివాలయంలో ప్రమాణస్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో అప్పలనాయుడుచేత ప్రమాణం చేయించారు. అనంతరం అప్పలనాయుడిని గవర్నర్, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. అప్పలనాయుడు ఈ ఎన్నికల్లో బొబ్బిలి నియోజకవర్గం నుంచి వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
*onlinenewsdiary.com extends greetings to jagan cabinet.