నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న 17 మంది సభ్యులున్న అంతర్రాష్ట్ర ముఠాలో ఆరుగురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ మంగళవారం తెలిపారు . వివిధ రాష్ట్రాల నుంచి , 32 యూనివర్సిటీల పేరుతో ఉన్న 160 నకిలీ సర్టిఫికెట్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు . ఈ నకిలీ సర్టిఫికెట్స్ దందా అయిదు సంవత్సరాలుగా నడుస్తోంది . ఒక్కో సర్టిఫికెట్ కు 50 వేల నుంచి లక్ష రూపాయలు తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి . కొందరిపై కేసులు నమోదు చేసి మరికొన్ని విచారణ చేస్తున్నామన్నారు .ఎల్ బి నగర్ లోని రాచకొండ సిపి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు . మేడిపల్లి లో డీజిల్ ట్యాంకర్ పేలుడు కేసులో రాజు కులాల్ అనే వ్యక్తిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు కమిషనర్ చెప్పారు . తాళాలు వేసి ఉన్న ఇళ్ళని బైక్ పై రెక్కీ నిర్వహించి చోరీలకు పాల్పడుతున్న నాగరాజు అనే పాత నేరస్తుడిని చైతన్యపురి పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు . ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులు రవీందర్ నాయక్,సంజీవ్,కీర్తి ధనరాజ్, లిమా సాగర్ లని అదుపులోకి తీసుకున్న సరూర్ నగర్ పోలీసులు, 6.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 45 వేల నగదు స్వాధీనం చేసుకున్నారన్నారు . చైతన్య పురి పోలీసు స్టేషన్ పరిధిలో ఐదుగురు ముఠా గా ఏర్పడి పలు బ్యాంకులలో నకిలీ డాక్యుమెంట్లను ఇచ్చి క్రెడిట్ కార్డులు/ డెబిట్ కార్డులు తీసుకుని బ్యాంకులను మోసం చేస్తున్న ముఠాలో ఒకరిని రాచ కొండ ఎస్ .ఓ .టి . పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీపీ చెప్పారు . నలుగురు పరారీలో ఉన్నారన్నారు.