దీపావళి రోజు జాగ్రత్తలు పాటించండి!
దీపావళి పండుగనగానే పిల్లలకు పెద్దలకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. ఇంటిల్లిపాది ఆడుతూ పాడుతూ చిందేస్తారు. వెలుగు దివ్వెల మధ్య పండగ చేసుకుంటారు. సాయంత్రం టపాసులు కాల్చుతూ కేరింతలు కొడతారు. అయితే.. ఆనందోత్సాహాలతో సంబరంగా జరుపుకునే దీపావళి రోజు.. జాగ్రత్తలు పాటించకపోతే జీవితం అంధకారం అవుతుంది.
దీపావళి సందర్భంగా జరిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. నగరంలో క్రాకర్స్ దుకాణాలు పెట్టేవారితో పాటు.. 34 హోల్ సేల్ దుకాణాదారులకు ఇరవై రోజుల నుంచి ఫైర్ సేఫ్టీ గురించి అగ్నిమాపకశాఖాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అగ్నిప్రమాదం జరగకుండా.. ఒకవేళ అనుకోకుండా దురదృష్టకర ఘటన జరిగితే ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై వారికి వివరిస్తున్నారు. సిటీ నుంచి విలేజ్ లకు క్రాకర్స్ తీసుకెళ్లేవారికి కూడా ప్రత్యేకించి అవేర్నెస్ కల్పిస్తున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో చైనా క్రాకర్స్ ను అమ్మకాలకు దూరంగా ఉంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఏ ఘటన జరిగినా 101 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని సూచించారు.
అటు ప్రభుత్వ చర్యలకు క్రాకర్స్ దుకాణాదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రభుత్వ నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తామంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చైనా క్రాకర్స్ ను విక్రయించట్లేదని చెబుతున్నారు.
మొత్తానికి దీపావళి పండుగ సందర్భంగా పటాకుల దుకాణాలు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. అయితే తక్కువ ధరకే దొరికే చైనా క్రాకర్స్ ఈ యేడు బ్యాన్ కావడంతో దేశీయ పటాకులకు డిమాండ్ పెరిగింది. ధర ఎక్కువ ఉన్నప్పటికీ దేశీయ పటాకుల కొనుగోలుకు నగరవాసులు ఉత్సాహం చూపిస్తున్నారు.