×

తెలంగాణ సంస్కృతి, చరిత్ర, ఆహార్యం, సంప్రదాయం ప్రతిబింబించాలి-సీఎం కేసీఆర్

తెలంగాణ సంస్కృతి, చరిత్ర, ఆహార్యం, సంప్రదాయం ప్రతిబింబించాలి-సీఎం కేసీఆర్

తెలుగు భాషాభివృద్ధి కోసం పాటు పడుతున్న సాహితీవేత్తలందరి సమక్షంలో హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు సూచించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితో పాటు తెలుగు భాష మాట్లాడే ముఖ్యమంత్రులు, గవర్నర్ లాంటి ప్రముఖులను మహాసభలకు ఆహ్వానించాలని చెప్పారు.డిసెంబర్ 15 నుంచి హైదరాబాద్ లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై ప్రగతి భవన్ లో గురువారం సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తెలుగుతో పాటు ఇతర గుర్తింపు పొందిన భారతీయ భాషలకు చెందన సాహితీ వేత్తలను కూడా మహాసభల సందర్భంగా గౌరవించి, సన్మానించాలని సూచించారు. వచ్చిన అతిథులకు బస, భోజనం, రవాణా లాంటి సదుపాయాల కల్పనలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఒక్కో వేదిక వద్ద ఒక్కో ఇన్చార్జి ఉండాలని సీఎం చెప్పారు. ప్రారంభోత్సవానికి ఉప రాష్ట్రపతి  వెంకయ్య నాయుడు, మరిషస్ వైస్ ప్రెసిడెంట్  పరమ శివమ్, మహారాష్ట్ర గవర్నర్  విద్యాసాగర్ రావు హాజరవుతారని, తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా ఆహ్వానించాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ముగింపు వేడుకలకు రాష్ట్రపతి  రామ్ నాథ్ కోవింద్ వస్తారని వెల్లడించారు.

మంత్రులు టి. హరీష్ రావు,  ఈటెల రాజెందర్, ప్రభుత్వ చీఫ్ విప్  కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎస్.పి.సింగ్, డిజిపి  మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్  నందిని సిధారెడ్డి, తెలుగు యూనివర్సిటీ వైస్ చాన్సలర్  ఎస్.వి. సత్యనారాయణ, అధికార భాష సంఘం అధ్యక్షుడు శ్రీ దేవులపల్లి ప్రభాకర్ రావు, జిహెచ్ఎంసి కమిషనర్  జనార్థన్ రెడ్డి, హెచ్ఎండిఎ కమీషనర్  చిరంజీవులు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎండి సివి ఆనంద్, ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి  సునిల్ శర్మ, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి  బుర్ర వెంకటేశం, డైరెక్టర్మామిడి హరికృష్ణ, గ్రంథాలయ పరిషత్ చైర్మన్  ఆయాచితం శ్రీధర్, టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఎండి  క్రిస్టినా, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్  వివి శ్రీనివాసరావు, సీఎం ముఖ్యకార్యదర్శి  నర్సింగ్ రావు, ప్రత్యేక కార్యదర్శి  భూపాల్ రెడ్డి, ఓఎస్డి శ్రీ దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

తెలుగు మహాసభల ప్రధాన వేదిక ఎల్.బి.స్టేడియం వేదిక డిజైన్ ను, హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయాల్సిన తోరణాల డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించి, ఆమోదించారు. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని, మహాసభల సందర్భంగా నగరాన్ని అందంగా ముస్తాబు చేయాలని సీఎం సూచించారు.

‘‘ప్రారంభ, ముగింపు సభలు రెండూ ఎల్.బి.స్టేడియంలోనే నిర్వహించాలి. ప్రముఖులతో పాటు పండితులు, సాహిత్యాభిమాలు పెద్ద ఎత్తున తరలివస్తారు కాబట్టి భద్రతా, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లు చూసుకోవాలి. మిగతా వేదికల వద్ద ప్రతీ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలి. ఎల్.బి. స్టేడియంలో ప్రతీ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రధాన కార్యక్రమం నిర్వహించాలి. అక్కడ సాహితీ సభలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఎల్.బి. స్టేడియంలో తెలంగాణ వంటకాల పేరుతో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయాలి. వివిధ కళా ప్రక్రియలకు సంబంధించిన స్టాళ్లు కూడా నిర్వహించాలి. తెలంగాణ ఆహార్యం, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయం ప్రతిబింబించే లేజర్ షో నిర్వహించాలి. చివరి రోజు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చాలి. నగరమంతా అందమైన అలంకరణలుండాలి. నగరం పండుగ శోభను సంతరించుకోవాలి. ఎక్కడికక్కడ స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలి. జంక్షన్లను అలంకరించాలి. తెలుగు సాహితీ మూర్తుల పేర్లతో తోరణాలుండాలి. నగరమంతా బెలూన్లు ఎగురవేయాలి. తెలుగు భాషా ప్రక్రియలతో పాటు హైదరాబాద్ సంస్కృతి ఉట్టిపడేలా ఉర్థూలో కవి సమ్మేళనం, కవ్వాలి లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించాలి. సభల సందర్బంగా తెలుగు భాషాభివృద్ది కోసం కృషి చేస్తున్న సంగీత, సాహిత్య, కళా రంగాలకు చెందిన ప్రముఖులను గౌరవించుకోవాలి. ప్రభుత్వం తరుఫున సన్మానించుకోవాలి. ప్రతీ కార్యక్రమానికి ఒక మంత్రిని ఆహ్వానించి, ప్రభుత్వం తరుఫున వారితో ఘనంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సన్మానం చేయించాలి. ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని నగరాల మేయర్లు, సివిల్ సర్వీస్ అధికారులు, కార్పొరేషన్ చైర్మన్లను ఆహ్వానించాలి. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన ప్రతినిథులకు మంచి వసతి, భోజనం, రవాణా ఏర్పాటు చేయాలి. పోస్టల్ శాఖ సమన్వయంతో తెలుగు మహాసభల సందర్భంగా ప్రత్యేక స్టాంపులను విడుదల చేయాలి. ఎయిర్ పోర్టు, బస్ స్టాండు, రైల్వే స్టేషన్లలో రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి, మహాసభలకు హాజరయ్యే వారికి సహాయపడాలి. సైనానెహ్వాల్, పివి సింధు, మిథాలీరాజ్, సానియా మీర్జా లాంటి క్రీడాకారులను కూడా మహాసభలకు ఆహ్వానించాలి. తెలుగు పండుగలు, సంవత్సరాలు, నెలలు, కార్తెలతో కూడిన పుస్తకాన్ని ముద్రించి మహాసభల సందర్భంగా పంపిణీ చేయాలి’’ అని ముఖ్యమంత్రి సూచించారు.

print

Post Comment

You May Have Missed