విదేశాల్లో ఉద్యోగావకాశాలను తెలంగాణ రాష్ట్ర యువతీ యువకులు అంది పుచ్చుకునేలా నెైపుణ్య శిక్షణా కార్యక్రమాలుండాలని రాష్ట్ర హోంశాఖామాత్యులు శ్రీ నాయిని నరసింహారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి శనివారం సచివాలయంలో స్కిల్ డెవలప్ మెంట్ పాలసీ, స్కిల్ మిషన్ ముసాయిదాపై ప్రణాళికాశాఖ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు శ్రీ యస్. నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీ పాపారావు, మునిసిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ.యం.జి.గోపాల్, ప్రణాళికాశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ బి.పి.ఆచార్య, కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ రజత్ కుమార్, ఐటి. కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, సాంకేతిక శాఖ డైరెక్టర్ శ్రీమతి వాణి ప్రసాద్, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ శ్రీ కిషన్, పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ శ్రీమతి నీతూ ప్రసాద్, నేషనల్ ఆకాడమి ఆఫ్ కన్సస్ట్రక్షన్ డి.జి., తెలంగాణ అకాడమి ఆఫ్ స్కిల్ డెవలప్ మెంట్ (టాస్క్) సిఈఓ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హోంశాఖ మాత్యులు మాట్లాడుతూ తెలంగాణ స్కిల్ డెవలప్ మెంట్ పాలసీకి రూపకల్పన చేయడం ఎంతో అభినందనీయమని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో మంచి పేరు తీసుకువస్తుందని, నైపుణ్యశిక్షణ ద్వారా ఎంతో మందికి ఉద్యోగాలు లభించి పేదరికం దూరమవుతుందని అన్నారు. నైపుణ్య శిక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిధులను పొందే ప్రయత్నం చేద్దామన్నారు. విదేశాల్లో డిమాండ్ ఉన్న రంగాలను గుర్తించి ఆయా రంగాల్లో తెలంగాణ యువతకు శిక్షణ నిచ్చేలా ముసాయిదా పాలసీలో పొందుపరచాలన్నారు. పాఠశాలలో, ఐటిఐలలో నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు శ్రీ యస్.నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నూతన తెలంగాణ రాష్ట్రంలో నైపుణ్య శిక్షణకు సంబంధించి ముసాయిదా పాలసీపై చర్చకు శ్రీకారం చుట్టడం, తొలి సమావేశం నిర్వహించుకోవడం మంచి పరిణామం అన్నారు.
నైపుణ్య శిక్షణ పాలసీని అమలు చేసే దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు వస్తుందని, పనిచేయగల వారిలో నైపుణ్యత పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని శ్రీ యస్.నిరంజన్ రెడ్డి అన్నారు. ఎన్నో పారిశ్రామిక సంస్ధలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత క్రింద నిధులను తమ ఇష్టానుసారంగా ఖర్చుపెడుతున్నారని ఆయా నిధులను కేంద్రీకృతంగా నైపుణ్య శిక్షణపై హెచ్చిస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.శిక్షణలో మంచి ప్రమాణాలు పాటించాలని, అర్హత ఉన్న వారిచే శిక్షణ నిప్పించాలని, శిక్షణ పొందిన వారికి నిర్ణీత సంస్ధల ద్వారా మాత్రమే సర్టిఫికేట్లు జారీ చేయాలని సూచించారు. శ్రమను గౌరవించే సంస్కృతికి శ్రీకారం చుట్టడం, పనిచేసే సంస్కృతిని పెంపొందించడం, వ్యక్తిగత నైపుణ్యాన్ని మెరుగుపరచడం లాంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేయగల వారందరిని పనిచేసే స్ధితిలో ఉండేలా ప్రభుత్వం చూడాలన్నారు. నైపుణ్య శిక్షణ పాలసీపై లోతుగా అధ్యయనం చేయడం ఎంతో ఉపయోగమన్నారు.
ప్రభుత్వ సలహాదారు శ్రీ పాపారావు మాట్లడుతూ నైపుణ్య శిక్షణకు సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాశికాశాఖ నోడల్ ఏజన్సీగా. ముసాయిదాను రూపొందించామన్నారు. ముసాయిదా పాలసీపై త్వరలోనే సి ఐ ఐ తో సమావేశం అవుతాయన్నారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ యం.జి గోపాల్ మాట్లాడుతూ నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను మొదటగా ఫైలట్ పద్ధతిలో చేపట్టి తదనంతరం విస్తరించాలన్నారు. వివిధ రంగాలలో పనిచేసే వారికి సమాజంలో గౌరవం లభించేలా చూడాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టాస్క్, నాక్ లు విజయవంతంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు.
ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ బి.పి.అచార్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 15 నుండి 59 సంవత్సరాల వయస్సు గల వారు 2.2 కోట్ల మంది ఉండగా, వారిలో 1.51 కోట్ల మంది యవత పనిని కోరుకుంటున్నారని, అందుబాటులో ఉన్నారన్నారు. 2012 నుండి 2022 వరకు తెలంగాణ రాష్ట్రంలో 50.9 లక్షల మంది మ్యాన్ పవర్ అవసరముంటుందని అంచనా అన్నారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ యువతకు శిక్షణను అందించి పారిశ్రామికాభివృద్ధికి, ఉత్పాదకత పెంచడానికి నైపుణ్యమైన పాలసీ రూపొందించడం జరుగుతుందన్నారు.