* తెలంగాణా రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది సంస్థ (tsipard) తో జిల్లా రూరల్ డెవలప్మెంట్ అధికారుల శిక్షణా తరగతులను ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్
* జిల్లాల విభజన నేపథ్యంలో కొత్తగా డీఆర్డీఓ వ్యవస్థ ఏర్పాటైన నేపథ్యంలో మూడు రోజుల శిక్షణా తరగతులను ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ
* ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు చేరువ చేసేందుకే జిల్లాల విభజనకు సీయం కేసీఆర్ శ్రీకారం చుట్టారు-జూపల్లి
* స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా గ్రామీణులకు ఇంకా సంక్షేమ ఫలాలు అందడం లేదు…ఈ పరిస్థితి తెలంగాణా రాష్ట్రంలో ఉండకూడదు…గ్రామాలు స్వయం సమృద్ది సాధించాలి…ఇందులో డీఆర్డీఓల పాత్ర కీలకమైనది
* ప్రజలే కేంద్రంగా సీయం కేసీఆర్ చేస్తున్న ఆలోచనల్లో అందరం భాగస్వాములు అవ్వాలి…అప్పుడే బంగారు తెలంగాణా సాధ్యమవుతుంది
* సీయం ఆశయం…ప్రభుత్వ లక్ష్యం…ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే అందరి బాధ్యత…ఇందులో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలి
* నిర్వీర్యమైన మహిళా సంఘాల్లో నూతనోత్తేజం తెచ్చేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నాం…అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయాలి…మహిళా భాగస్వామ్యం ఉంటేనే కార్యక్రమాలు విజయవంతం అవుతాయి
* పారిశుధ్ద్యం, కంపోస్టు తయారీ, ఇంకుడు గుంతల నిర్మాణం లాంటి పనులను ఉపాధి హామీ పథకంలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం
* గ్రామంలోని కనీసం 60 శాతం కుటుంబాలకు 100 ఉపాధి హామీ పనిదినాలు కల్పించాలి
* విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు… బాగా పనిచేసే వారికి ప్రోత్సాహకాలుంటాయి
* ఉపాధి హామీ పనులపై కరపత్రాల ద్వారా ఇంటింటి ప్రచారం నిర్వహించాలి… ప్రతి ఇంటికీ కరపత్రం చేరేలా చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి చేరడమే లక్ష్యంగా జిల్లాల విభజనను సీఎం కేసీఆర్ చేపట్టారని…ఇందుకోసం ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పనిచేయాలని తెలంగాణ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కోరారు. జిల్లాల విభజన తర్వాత డ్వామా, డీఆర్డీఏ లను ఏకం చేస్తూ జిల్లా రూరల్ డెవలప్ మెంట్ అధికారుల వ్యవస్థకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ రెండు శాఖలపై డీఆర్డీఓలకు అవగాహన కల్పించేందుకు రాజేంద్రనగర్ లోని టీ-సీపార్డ్ లో మూడు రోజుల శిక్షణ తరగతులను మంత్రి జూపల్లి కృష్ణారావు, కమిషనర్ నీతూ కుమారి ప్రసాద్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ… స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్ధాలు గడుస్తున్న గ్రామాలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందడంలేదన్నారు. గ్రామాల స్వయం సమృద్ధి లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. ప్రజలే కేంద్ర బిందువుగా సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తారని, ఇందులో భాగంగానే దేశానికి ఆదర్శంగా తెలంగాణను నిలిపేలా జిల్లాల విభజనకు శ్రీకారం చుట్టారన్నారు. సీఎం కేసీఆర్ ఆశయం, ప్రభుత్వ లక్ష్యం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా అందరి భాగస్వామ్యంతో ముందుకు పోవాలని డీఆర్డీఓలకు మంత్రి సూచించారు. ప్రజల సేవ చేయాలనే తపన, చిత్తశుద్ధి ఉంటే సాధ్యం కానిది ఏది లేదన్నారు. కొత్త రాష్ట్రంలో నూతన ఒరవడి, కొంగొత్త కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని… ఉద్యోగులు కూడా కార్యనిర్వహణలో కొత్తదనం చూపాలన్నారు. అర్హులందరికి పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేసేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములై పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర సాధనలో కలిసి కట్టుగా పనిచేసినట్టుగానే రాష్ట్ర అభివృద్ధిలోను భాగస్వామ్యం అవ్వాలని కోరారు. ఇప్పటికే విద్యుత్ సరఫరా, నూతన పారిశ్రామిక విధానం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథల ద్వారా దేశానికే రాష్ట్రం ఆదర్శంగా మారిందన్నారు. ఇదే తరహాలో తెలంగాణ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కూడా ఆదర్శంగా నిలవాలని, చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
మహిళాసంఘాల బలోపేతానికి చర్యలు
గత కొన్నేళ్లుగా మహిళాసంఘాలు నిర్విర్యమై పోయాయని… మహిళా సంఘాలను సంఘటిత శక్తిగా రూపోందించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆర్ధిక పరిపుష్టితో పాటు మహిళల శక్తి, సామర్ధ్యాలను వెలికి తీసేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోను మహిళాసంఘాలను భాగస్వామ్యం చేయడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. మహిళాసంఘాలు క్రియశీలకంగా పనిచేసిన చోటే హరితహారంలో మెరుగైన ఫలితాలు వచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
కనీసం 60శాతం కుటుంబాలకు ఉపాధిహామి
గ్రామంలోని కనీసం 60 శాతం కుటుంబాలకు వంద రోజుల ఉపాధిహామి పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఆ దిశగా గ్రామంలో కూలీలకు పనిలేని పరిస్థితి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధిహామి పనులపై కరపత్రాల ద్వారా ఇంటింటి ప్రచారం నిర్వహించాలని, కూలీలకు అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం కూలీలకు ప్రతిరోజు నిర్ణిత సమయంలో ఫీల్డ్ అసిస్టెంట్ లు, గ్రామ కార్యదర్శులు అందుబాటులో ఉండాలన్నారు. పారిశుద్ధ్యం, ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం లాంటి కార్యక్రమాలను ఉపాధిహామి ద్వారా చేపట్టాలని సూచించారు. మెరుగైన పనితీరు కనబర్చిన వారికి ప్రోత్సాహాకాలు అందివ్వడంతో పాటు… నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవనే సంకేతాలు ఇవ్వాలన్నారు.
శిక్షణ కార్యక్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెస్లీ, సైదులు, ఆశ, సెర్ప్ అధికారులు రాజేశ్వర్ రెడ్డి, బాలయ్య, డీఆర్డీఓలు పాల్గొన్నారు.