×

తెలంగాణకు ఎక్కువ పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలి – ముఖ్యమంత్రి పిలుపు

తెలంగాణకు ఎక్కువ పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలి – ముఖ్యమంత్రి పిలుపు

అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రం గురించి యావత్ ప్రపంచానికి తెలియచెప్పే అభివృద్ధి రాయబారులుగా పనిచేయాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ ఎన్.ఆర్.ఐ.లకు పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడానికి 42 దేశాల నుంచి వచ్చిన ప్రతినిథులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఆదివారం రాత్రి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి సీఎం మాట్లాడారు. చైనాలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన తర్వాత వివిధ దేశాల్లో స్థిరపడిన చైనీయులే మొదట అక్కడ పెట్టుబడి పెట్టి ఆ దేశాభివృద్ధిలో కీలకంగా నిలిచారని, తెలంగాణ ఎన్.ఆర్.ఐ.లు కూడా ఇదే ఒరవడి ప్రదర్శించి, తెలంగాణ అభివృద్దిలో భాగస్వాములు కావాలని సీఎం కోరారు.

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను, సంక్షేమ కార్యక్రమాలను, భాషా సంస్కృతిక రంగాల్లో చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి వారికి వివరించారు.

‘‘ఉద్యమ సమయంలో తెలంగాణ ఎలా ఉండాలని కోరుకున్నామో, ఇప్పుడు అదే విధంగా తెలంగాణ దూసుకుపోతున్నది. అనుకున్నది అనుకున్నట్లుగా సాగుతున్నది. 17.8 శాతం ఆదాయ వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ నిలిచింది. 2024 నాటికి తెలంగాణ బడ్జెట్ ఐదు లక్షల కోట్లు ఉంటుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ప్రాజెక్టుల నిర్మాణం లాంటి కార్యక్రమాలు అద్భుతంగా అమలవుతున్నాయి. రూ.40వేల కోట్లతో కళ్యాణలక్ష్మి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కేసీఆర్ కిట్స్ లాంటి సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ సంక్షేమ రంగంలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచాం. తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణ చాలా బాగుంది. మంచి వాతావరణం ఉంది. కేవలం 15 రోజుల్లోనే అనుమతులిచ్చే అవినీతికి ఆస్కారం లేని పారిశ్రామిక విధానం అమలవుతున్నది. ఈ విషయాలను ప్రపంచ వ్యాప్తంగా వివరించి తెలంగాణకు ఎక్కువ పెట్టుబడులు రావడానికి కృషి చేయండి. తెలంగాణ బిడ్డలుగా మీ కర్తవ్యాన్ని నెరవేర్చాలని కోరుతున్నాను’’ అని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

‘‘సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. అన్ని రంగాల్లో వెనుకబడింది. తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. తెలంగాణ గొప్పతనం మరుగున పడింది. మన భాష, యాస, సంస్కృతి అన్నీ అవమానానికి గురయ్యాయి. ఈ పరిస్థితిలో మనం తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేసినప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పెద్దల నుంచి, వివిధ రాజకీయ పార్టీల నుంచి అనేక ప్రశ్నలు వచ్చేవి. ఢిల్లీలో ఎవరితో మాట్లాడినా మనల్ని ఆంధ్రవారిగానే సంబోధించేవారు. ‘ఆంధ్ర మే క్యా హోరా’ అనే వాళ్లు. మన తెలంగాణ అస్తిత్వాన్నే ఎవరూ గుర్తించలేదు. తెలంగాణకు ప్రత్యేక అస్తిత్వమున్నదనే విషయాన్నే మరుగున పడేసే ప్రయత్నం జరిగింది’’ అని సీఎం అన్నారు.

‘‘సమైక్య రాష్ట్రంలో ముఖ్యంగా మూడు విషయాల్లో తీవ్ర వివక్ష జరిగింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికొచ్చే ఆదాయంలో 70 శాతం వరకు తెలంగాణ నుంచే వచ్చేది. కానీ 10-15 శాతం కూడా తెలంగాణ కోసం ఖర్చు చేయలేదు. ప్రొఫెసర్ జయశంకర్, ఆర్థిక వేత్త హనుమంతరావు 1956 నుంచి లెక్కలు తీసి ఈ విషయం బయటపెట్టారు. 1350 టిఎంసిల నీటి వాటా తెలంగాణకున్నప్పటికీ కనీసం 200 టిఎంసిలు కూడా వాడుకోలేదు. ఉద్యోగ నియామకాల్లో కూడా ఎంతో వివక్ష జరిగింది. భాష, సంస్కృతిపై దాడి జరిగింది. సినిమాల్లో తెలంగాణ వారిని జోకర్లుగా చూపెట్టేవారు. అట్లాంటి స్థితి నుంచే మనం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. వచ్చిన తెలంగాణలో అన్ని రకాలుగా అభివృద్ది సాధించుకుంటున్నాం. తెలంగాణకు పూర్వ వైభవం తెచ్చుకుంటున్నాం’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

‘‘చిమ్మ చీకట్లు అలుముకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ రంగంలో అద్భుత ప్రగతి సాధించాం. రాష్ట్రం ఏర్పడిన 6వ నెల నుంచే కోతల్లేని విద్యుత్ అందించుకుంటున్నాం. వచ్చే జనవరి 1 నుంచి నాణ్యమైన కరెంటును 24 గంటల పాటు అన్ని రంగాలకు అందించబోతున్నాం. హైదరాబాద్ నగరంలో క్షణం కూడా కరెంటు పోకుండా ఐలాండ్ పవర్ సప్లయ్ చేస్తున్నాం. మిషన్ కాకతీయ ద్వారా 70 శాతం చెరువుల పునరుద్ధరణ జరిగింది. మిషన్ భగీరథ ద్వారా వచ్చే జనవరి చివరి వరకు అన్ని గ్రామాలకు, ఆవాస ప్రాంతాలకు స్వచ్ఛమైన, సురక్షితమైన మంచినీరు అందుతుంది. పాత ఏడు జిల్లాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే జూన్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పాక్షికంగా నీరు అందుతుంది. రైతులను అప్పుల ఊబి నుంచి బయట పడేయడానికి ఎకరానికి ఏడాదికి రూ.8వేల పెట్టుబడి అందించే కార్యక్రమం వచ్చే ఏడాది నుంచి ప్రారంభం అవుతుంది. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ది కోసం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం మంచి ఫలితాలు ఇస్తున్నది. 15 రోజుల్లోనే అనుమతులిస్తున్నాం. ఇప్పటికే 5వేల పరిశ్రమలకు అనుమతులివ్వగా, వాటిలో రెండు వేల పరిశ్రమలు పని ప్రారంభించాయి. ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతున్నది. ఈ విషయాలన్నీ ప్రపంచానికి చెప్పి,

ఈ సమావేశంలో ఎంపిలు  కె. కేశవరావు, జితేందర్ రెడ్డి, శ్రీమతి కల్వకుంట్ల కవిత, ఎన్.ఆర్.ఐ. ల కో ఆర్డినేటర్ మహేష్ బిగాల తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed