తాడేపల్లి: యాస్ తుపాన్ కదలికలను పరిశీలిస్తే.. ఏపీపై స్వల్ప ప్రభావం ఉండే అవకాశాలున్నాయని, పరిస్థితులను అంచనా వేసుకొని ముందుకుసాగుతామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తుపాన్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని మాట్లాడారు. యాస్ తుపాన్ హెచ్చరికల దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. యాస్ తుపాన్ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు.
తుపాన్ వల్ల కోవిడ్ రోగులకు ఇబ్బందులు తలెత్తకూడదు
యాస్ తుపాన్ వల్ల కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశించారు. ముందుజాగ్రత్తగా వారిని తరలించాల్సిన పరిస్థితులు ఉంటే.. వెంటనే ఆ చర్యలు తీసుకోవాలని సూచించారు. యాస్ తుపాన్ ప్రభావంపై కేంద్రమంత్రి అమిత్షాతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం తుపాన్ వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికారులను అప్రమత్తం చేశామని అధికారులు సీఎంకు వివరించారు.
సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను వెంటనే సహాయక శిబిరాల్లోకి చేర్చాలన్నారు. సహాయక శిబిరాల్లో అన్ని రకాల సదుపాయాలు ఉండేలా చూసుకోవాలని సూచించారు. కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, అవసరమైతే సాంకేతిక సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశించారు. ఆక్సిజన్ సిలిండర్లను రీఫిల్లింగ్ చేసే ప్లాంట్లకూ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఆస్పత్రులకు కరెంట్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రత్యేకంగా విద్యుత్ సిబ్బందిని ఆయా ఆస్పత్రులకు కేటాయించాలని సీఎం వైయస్ జగన్ సూచించారు.
తుపాన్ కారణంగా ఒడిశా ప్లాంట్ నుంచి ఆక్సిజన్ సేకరణకు ఇబ్బంది వస్తే.. ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశించారు. తగినంత ఆక్సిజన్ నిల్వలు పెట్టుకోవాలని సూచించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరత రాకుండా ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఆక్సిజన్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, తుపాన్ పరిణామాలను ఊహించి ఆ మేరకు సిద్ధం కావాలని అధికారులను సీఎం ఆదేశించారు.