మారిమలై ముళఞ్జిల్ మన్నిక్కిడన్దుఱఙ్గమ్
శీరియ శిఙ్గరివిత్తుత్తీ విళిత్తు
వేరిమయిర్ పొఙ్గ వెప్పాడుమ్ పేర్ న్దుదరి
మూరి నిమిర్ న్దు ముళఙ్గిప్పురప్పట్టు
పోదరుమాపోలే, నీ పూవైప్పూవణ్ణా ! ఉన్
కోయిల్ నిన్రిఙ్గనే ఫోన్దరుళి కోప్పుడైయ
శీరియ శిఙ్గాపనత్తిరున్దు యామ్ వన్ద
కారియమారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్
*
ఒక సింహం తన గుహలోంచి బయలుదేరి ఎట్లా వస్తుంది అనే
అద్భుత వర్ణన ఆండాళ్ ఈ నాటి పాటలో చేస్తుంది.—–
ఈ రోజు అమ్మ స్వామి సన్నిధానానికి చేరి స్వామిని మేల్కొల్పే పాశురం. భగవంతుణ్ణి చేరే వరకే శాస్త్రం, ఇక చేరిన తర్వాత ఇక శాస్త్రానికి ప్రాధాన్యం లేదు. లోకంలో మనకు తెలుసు ఎలగైతే వివాహం జరిగే వరకే శాస్త్రం ,ఆ పై శాస్త్రాలు వర్తించవు .ఇరువురి ప్రేమ విషయంలో అట్లానే భగవంతుణ్ణి చేరే వరకు ఎన్నో నియమాలు ఉంటాయి, ఎన్నో రకాల పరీ క్షలు ఉంటాయి. ఇక భగవంతుణ్ణి సన్నిధానానికి చేరాక భగవంతుడు భక్తుల పట్ల సర్వాత్మనా చెందే ఉంటూ తన వాళ్ళు ఆదేశించినట్లు ప్రవర్తిస్తూ ఉంటాడు.
ఇక స్వామి ఎలా రావాలో చెబుతూ వానా కాలంలో కొండ గుహల్లో నిదురించే సింహం తనంతట తాను మేలుకాంచి బయటికి వచ్చే ప్రక్రియ ఎట్లా ఉంటుంది అనేది వర్ణన. “మారి” వానాకాలం అనగానే విడిగా ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తుంది, కలిసిన వారికి ఆనందాన్ని ఇస్తుంది, వైరాలని మరిపిస్తుంది. యుద్ధాలు చేసే వారు కూడా వానా కాలంలో ఆపేస్తారుకదా. సుగ్రీవుడు రాజ్య సుఖాలతో హాయిగా ఉంటే, రాముడు మాల్యాద్రి పర్వతం పై ఉండి తనకు జరిగిన సీతా విరహాన్ని లక్ష్మణ స్వామికి విన్నవించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మనం కూడా ఒక వానాకాలంలోనే ఉన్నాం మరొక వానా కాలం కోసం ప్రతిక్షిస్తున్నాం. ఏ వానా కాలంలో ఉన్నాం అంటే రక రకాల దుఃఖాలను సంతతమూ వర్షించే ఈ భూమి పై ఉన్నాం కదా “బహుదా సంతత దుఖ:వర్శిని బవ దుర్దినే అద:స్కలితం” అంటారు మన యామునాచార్యులవారు. ఈ సంసారం అనే అరణ్యంలో దారి తప్పి సంచరిస్తున్నాం, “అవివేక ఘన అంద ద్విగ్ముఖే” అవివేకం అనే కారు మబ్బులు కప్పుకొని దారి తప్పి పోయాం. వివేకం అంటే విడదీసి బ్రతకటం, దేన్ని విడదీసి అంటే ఆత్మను మరియూ శరీరాన్ని వేరుగా చూసి బ్రతకడం, ఇలా బ్రతకక పోవడమే అవివేకం, దీనివల్ల నిరంతరం దుఃఖం వర్షిస్తుంది , సూర్యుడు కనిపించడం లేదు. మనలోని అజ్ఞానం మనల్ని ఎప్పటికి అచ్యుత భానుణ్ణి కనిపించకుండా చేస్తుంది. మరి ఆ మబ్బుల్ని మన అంతట మనం తొలగించుకోగలమా, లేదు కదా, మరి ఆ సూర్యుడే తనంతట తాను మనకు కనిపించే ప్రయత్నం చేయాలే తప్ప మనం ఆయనను చూడలేం. అందుకే “మాం అవలోకయా అచ్యుత” అని ప్రార్థిస్తారు. నేను నిన్ను చూడలేను, నీవే ఆటంకాలు తొలగించు.
అలాంటి వానాకాలంలో “మలై మురైంజిల్”పర్వతపు గుహల్లో “మన్ని క్కిడందుఱంగుం”మన్నికగా కాళ్లు ముడుచుకొని పడుకొని నిదురించే “శీరియ శింగం” నిద్రలో కూడా పరాక్రమాన్నీ వీడక ఉండే సింహం. శక్తి తేజస్సు ఎప్పటికి కల్గిన సింహం. సింహం తనంతట తానూ లేచి రావాల్సిందే కాలం లేపినప్పుడు, కానీ ఎవ్వరు దానిని లేప తగరు. ఆండాళ్ తల్లి ,ఈ సింహం ఎలాగైతే మృగరాజైనట్లుగా సాక్షాత్తు జీవులకు రారాజైన ఆ భగంతుడిని భావిస్తుంది. సింహం ఎలాగైతే గుహల్లోంచి బయటకు రావడం అనేది మన ఆలయాల్లోంచి ఉత్సవమూర్తి బయటకు రావడమా అన్నట్లుగా చెబుతుంది. “శీరియ శింగం” శ్రీతో కూడుకున్న స్వామి. అయితే స్వామి సంకల్ప విశిష్టుడై ఉంటాడు కదా, సృష్టికి పూర్వదశ కూడా నిర్గుణ దశ కాదు అని ఉపనిషత్తులు చెప్పినట్లుగానే అది “శీరియ శింగం” అని ఆండాళ్ చెబుతుంది.
“అరివుత్తు” ఆ సింహం తనంతట తాను లేచి “త్తీవిరిత్తు” ఒక్క సారి తన తేజస్సును బయటకు నేత్రాల నుంచి కనిపించేట్లుగా తెరిచింది. “వేరి మయర్ పొంగ” తన జూలును గగుర్పాటు వల్ల ఒక్క సారి దులుపు కొని “ఎప్పాడుం పేరుందుదఱి”ఇటూ అటూ దొర్లుతూ, “మూరి నిమిరుందు మురంగి ప్పుఱప్పట్టు” ఒక పెద్దగా గర్జిస్తూ “పోదరుమా పోలే” అప్పుడది బయలుడేరినట్లే నీవూ అట్లా రావాలి.
సృష్టి పూర్వ దశ నుంచి సృష్టి తరువాత దశ వరకు ఆండాళ్ స్వామిని సింహం తో పోలుస్తుంది. ఆది ఎట్లా అని చాందోగ్య ఉపనిషత్ వర్ణిస్తుంది. సృష్టి కి ముందు భగవంతుడు ఒక సంకల్పం చేస్తాడట. ఆసంకల్పం “తడైక్షత భహుష్యాం ప్రజా యేయేతి” నేనె, నా నుంచి అనేకమందిని సృస్టిస్తును గాక అనుకుంటాడట. ఇక సృష్టి చేయడం ఎలా అంటే త్రివుత్కరణం అని చెబుతారు.
మొదట తనలోంచి తేజస్సుని తీస్తాడు, తేజస్సులోంచి జలాన్ని తీస్తాడు, జలంలోంచి పృథ్విని తీస్తాడు. ఇక వీటిని సగం సగం సగం భాగాలుగా చేస్తాడు. ప్రతి రెండో భాగాన్ని మళ్ళి సగం సగం చేస్తాడు. ఇప్పుడు ప్రతీదీ ఒక పెద్ద భాగం గా రెండు చిన్న భాగాలుగా ఉంటాయి. ఇక అన్ని భాగాలు ఒక్కో దానిలో వచ్చేట్లుగా పంచి మూడింటిని సిద్ధం చేస్తాడు. అయితే ప్రతీదాంట్లో ఏదో ఒక భాగం ఎక్కువగా ఉండి మిగతావి రెండు తక్కువగా కల్గి ఉంటాయి. ఇవన్నీ కల్పి ఒక అండం క్రింద తయారు చేస్తాడు. దీన్నే బిగ్ బ్యాంక్ అని ఇప్పటి వాళ్ళు చెబుతున్నారే అది. “యుగప్పత్ సృష్టికార్యం” ఒక చిటికెలో సృష్టికార్యం జరిగి పోయింది, అనేక కోట్ల అండాలు బయటకు వస్తాయి. అలా బయటకు వచ్చిన ఒక అండంలో ఒక గోళంలో మనం ఉన్నాం. ఈ బయటకు వచ్చిన ప్రతి అండంలో ఒక బ్రహ్మ ను పెడుతాడు. ఆ బ్రహ్మ శరీరంలోంచి పదకోండు ప్రజాపతులను బయటికి తీస్తాడు. ఇంతవరకు తాను నేరుగా చేస్తాడు. దీన్నే అద్వారక సృష్టి అంటారు. బ్రహ్మకు వేద ఉపదేశం చేసి, ఇక పై బ్రహ్మ ద్వారా సృష్టి చేస్తాడు. ఇది సద్వారక సృష్టి. ఇక బ్రహ్మ సృష్టించాక అన్నీ వస్తువులలో అంతర్యామి అయ్యి తానుంటాడు.
ఈ కార్యాన్నంతా ఆండాళ్ తల్లి ఇక్కడ చెబుతుంది. ఒక శీరియ సింహం అంటే సంకల్ప విశిష్టుడైన స్వామి, సింహం ఎలాగైతే తనంతట తాను లేచిందో, సృష్టి ఎవరో ప్రేరేపిస్తే చేసేది కాదు, తనంతటా తానూ ఐచ్చికంగా చేసేది. ఇక సింహం ఎలాగైతే తన తీక్షణమైన కళ్ళు తెరిచిందో పరమాత్మ తనలోంచి తేజస్సును బయటికి తీస్తాడు. సింహం తన జూలును విప్పార్చి తన పరిమళాన్ని అన్నివైపులా వెదజల్లినట్లే, శాస్త్రం “గందవతీ పృథ్వీ” అని చెబుతుంది కదా, పరమాత్మ పరిమళo కల భూమి లోంచి నీటిని బయటికి తీస్తాడు. ఇక సింహం పడి అన్నివైపులా పొర్లుతున్నట్లుగా పరమాత్మ త్రివుత్కరణం చేసాడు. ఇక సింహం ఎలాగైతే సాగిందో పరమాత్మ తన సృష్టికార్యాన్ని సాగించాడు. ఏర్పడ్డ ఒక్కో అండంలో ఒక్కో బ్రహ్మను ఉంచాడు. సింహం ఎలాగైతే గర్జించిందో తాను బ్రహ్మకు వేదాలని ఉపదేశం చేసాడు. ఇక సింహం తన యాత్రను ముందుకు సాగించినట్లే, పరమాత్మ అన్నింటిలో అంతర్యామియై ఉన్నాడు. ఈక్కడ గోదాదేవి నాభిస్తానంలో పవళించి ఉన్న ఆ అంతర్యామిని తన హృదయ సింహాసనంలో కి నిలిచి ఉండేలా రమ్మని భావిస్తుంది. ఆలయాల్లో ఉత్సవ విగ్రహం పురపాడు కి బయలుదేరినట్లు గా కూడా భావిస్తుంది. గర్భాలయాల్లో ఉండే మూర్తి కదలడు కనుక కదిలే రూపంలో ఉత్సవ విగ్రహంగా మనకు దర్శనం ఇస్తాడు. “నీ పూవైప్పూ వణ్ణా” అదసీ పుష్పం వంటి సౌందర్యం కల వాడా, “ఉన్ కోయిల్ నిన్ఱు” నీ కోవల నుండి, అంటే ఓంకారమనేదే స్వామి ఇల్లు కదా ఆ వేద తత్వమనేది బయటికి రావాలి తన స్థానాన్ని ప్రదర్శించాలి. ఇక ఆలయాల్లోంచి ఉత్సవ మూర్తి బయటికి రావాలి, ఒక శ్రీకృష్ణుడు తన మందిరంలోంచి బయటికి రావాలి ఇన్నింటిని ఆండాళ్ భావిస్తోంది. “ఇంగనే పోందరిళి” ఇలానే రావాలి అని చెబుతుంది, మన ఆండాల్ “అన్నవయల్ పుదువై ఆండాళ్” పరమహంసలే నడక నేర్ప గలిగేది కద, తాను శ్రీకృష్ణుడి కి కూడా నేర్పుతుంది.
“క్కోప్పుడైయ శీరియ శింగాశనత్తిరుందు” అలంకృత సింహాసనంపై కూర్చొనమని ప్రార్థిస్తుంది ఆండాళ్. ఇక్కడ సింహాసనం అంటే మన హృదయ సింహాసనం, జ్ఞాన, అజ్ఞాన, ఐశ్వర్య, అనైశ్వర్య, ధర్మ, అధర్మ, వైరాగ్య ఇహ్యాదులు అన్నీ కలిసి ఉండే ఈ ఆసనంలోంచి సృష్టికి కావల్సిన సృజ్య వస్తువులు వస్తూ ఉంటాయి, ఇక ఆలయాల్లో అయితే దర్మ పీఠాసనం అంటారు, ఇక శ్రీకృష్ణ భవనంలో సింహాసనం భావిస్తూ ఆండాళ్ శ్రీకృష్ణుడిని దానిపై కుర్చొమ్మని చెబుతుంది.