
– పెద్ద సంఖ్యలో భక్తులు, అధికార,అనధికారుల హాజరు
తిరుపతి 14 జనవరి 2021: ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్బంగా గురువారం రాత్రి తిరుపతి టీటీడీ పరిపాలన భవనం ఆవరణంలోని మైదానంలో శ్రీ కృష్ణ శ్రీ గోదా దేవి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. టీటీడీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, అధికార, అనధికార ప్రముఖులు పాల్గొన్నారు.
డిపిపి కార్యదర్శి ఆచార్య రాజగోపాలన్ గోదాదేవి ఆవిర్భావం, గోదా కళ్యాణం ప్రాశస్త్యం గురించి వివరించారు. 5 వేల సంవత్సరాల క్రితం జరిగిన శ్రీ గోదా కళ్యాణం శ్రీవారి దయతో నేడు భక్తులు మళ్ళీ చూడగలిగే భాగ్యం కలిగిందన్నారు. ధనుర్మాసానికి వీడ్కోలు, మకర సంక్రాంతికి స్వాగతం పలుకుతూ గోదా కల్యాణం నిర్వహిస్తున్నట్టు చెప్పారు.శ్రీ గోదాదేవి శ్రీ వేం కటేశ్వర స్వామివారి మీద పాశురం కీర్తించి స్వామివారి సరసన నిలిచిన మహా భక్తురాలని చెప్పారు.
ప్రధాన అర్చకులు శ్రీ శేషాచల కృష్ణమాచార్యులు, అర్చకులు శ్రీకృష్ణ స్వామి, శ్రీ గోదా దేవి కళ్యాణం కోసం పుణ్యాహవచనం, విష్వక్సేన ఆరాధన, అంకురార్పణ, కంకణ పూజ నిర్వహించారు. తొలుత సర్కారు సంకల్పం, అనంతరం భక్తులందరితో సంకల్పం చేయించారు. ఆభరణాలు, పుష్పమాలలతో విశేషంగా అలంకరించిన శ్రీ గోదాదేవి శ్రీ కృష్ణ స్వామి వారికి కంకణాలు కట్టి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. కళ్యాణం అనంతరం అర్చకులు శ్రీ గోదాదేవి రచించిన 10 పాశురాలను పఠిస్తూ, వారణ మాయిరం క్రతువు నిర్వహించారు. చివరగా నివేదన, మంగళ హారతితో కళ్యాణ వేడుక ముగిసింది.
అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీవారిని వైభవాన్ని చాటుతూ కీర్తనలు ఆలపించారు. మైదానంలోని భక్తులు సామూహికంగా గోవింద నామాలు పఠించారు.
రాత్రి 8.30 గంటలకు ఈ వేడుక ముగిసింది.
కార్యక్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి దంపతులు, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సతీమణి శ్రీమతి స్వర్ణలత రెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటి ఈవో హరీంద్ర నాథ్, శ్రీవారి ఆలయ ఓఎస్డీ పాల శేషాద్రి, విజఓ బాలిరెడ్డి పాల్గొన్నారు.
తిరుమలలో ముగిసిన ధనుర్మాస పూజ కార్యక్రమాలు
తిరుమల, 2021 జనవరి 14: పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకొని తిరుమల నాద నీరాజన వేదికపై డిసెంబరు 15వ తేదీ నుండి మార్గశిర విష్ణు వైభవ ప్రవచనం, వసంత మండపంలో జనవరి 10వ తేదీ నుండి నిర్వహిస్తున్న శ్రీ విష్ణు బిల్వాపత్రార్చన పూజ కార్యక్రామలు గురువారం ముగిసాయి. ఉదయం 6 నుండి 6.30 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
వసంత మండపంలో ….
ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుడు, నమూనా అనంత పద్మనాభ స్వామివారి విగ్రహన్ని వసంత మండపంలో వేంచేపు చేశారు. సాధారణంగా శివునికి బిల్వాపత్రాలతో పూజ నిర్వహిస్తారనే విషయం తెలిసిందే, కానీ పవిత్రమైన ధనుర్మాసంలో మాత్రమే శ్రీ మహా విష్ణువును బిల్వాపత్రాలతో పూజించడం వలన విశేష శుభ ఫలితాలు కలుగుతాయని వేదాల నుండి తెలుస్తుంది. జనవరి 10 నుండి 14వ తేదీ వరకు తిరుమలలో ఈ పూజ నిర్వహించారు.
నాద నీరాజన వేదికపై …
శ్రీ మహా విష్ణువు కథలైన భాగవతం, విష్ణు పురాణం వినటం వలన ముక్తి లభిస్తుందని డిసెంబరు 15 నుండి జనవరి 14వ తేదీ వరకు తిరుమలలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
లోక క్షేమం కొరకు ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని శ్రీవారిని ప్రార్ధిస్తూ టిటిడి ఈ పూజ కార్యక్రమాలను నిర్వహించిన విషయం విదితమే.