గడువులోగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలి
టైమ్ ఫ్రేమ్ తో పనిచేయాలని, అప్పుడే లక్ష్యాన్ని అందుకోగలమని మంత్రి హరీష్ రావు అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని సీఎం కేసీఆర్ క్షణక్షణం సమీక్షిస్తున్నారని, నిర్ణీత గడువులోగా ఆయా ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని హైదరాబాద్ లోని జలసౌధలో 9 గంటలకు పైగా ఆయన సమీక్షించారు. కాళేశ్వరంతో పాటు పలు సాగునీటి ప్రాజెక్టుల పనుల భూసేకరణ, ఇతర సమస్యలు, పురోగతిపై చర్చించారు.
భక్త రామదాసు, ఎస్ఆర్ఎస్ పి రెండో దశ, సింగూరు కెనాల్, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టులను వచ్చే ఖరీఫ్ లోపు పూర్తిచేసి నిర్దేశించిన ఆయకట్టుకు నీరివ్వాలని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. 2018 లోగా వరద కాలువ, శ్రీపాద ఎల్లంపల్లి, కాళేశ్వరం పనులు పూర్తి చేయవలసి వుందని హరీశ్ రావు చెప్పారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు టన్నెల్ పనులు వేగవంతం చేయాలన్నారు. ఏళ్ల తరబడి పూర్తి కాకుండా వున్న దేవాదుల ఎత్తిపోతల పథకం యేడాదిలో పూర్తి చేయాలని మంత్రి కోరారు.
మీడియం ప్రాజెక్టులైన కిన్నెరసాని, పాలెం వాగు, గొల్లవాగు, ర్యాలివాగు, నీల్వాయి, కొమురం భీమ్, పెద్దవాగు (జగన్నాధపూర్), మత్తడి వాగు ప్రాజెక్టులను కూడా వచ్చే ఏడాది కల్లా పూర్తి చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. లెండి, మొండికుంట వాగు పధకాలను 2018 లోపు పూర్తి చేయాలన్నారు. లోయర్ పెనుగంగ, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేయడానికి కృషి చేయాలని హరీశ్ రావు కోరారు. ఆయా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సీఎం కేసీఆర్ నిర్ణయించిన కాలపరిమితి లోపు పూర్తి చేయాలని ఇరిగేషన్ మంత్రి కోరారు.
మహబూబ్ నగర్, కరీంనగర్ వంటి ప్రాంతాలలో సాగునీటి పథకాలకు కొంత అడ్డంకిగా వున్న రైల్వే క్రాసింగ్ సమస్యలన్ని ఆరు నెలల్లో పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. టెండరు పిలవడంలో పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలని, నెలల కాలపరిమితితోనే టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సి.ఇ, ఎస్.ఇ, ఇతర అధికారులను మంత్రి కోరారు.
ప్రాజెక్టుల భూసేకరణ కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు. స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో పూర్తి చేయాలన్నారు. వచ్చే ఖరీఫ్ లోగా నీరివ్వాలనుకుంటున్న సాగునీటి ప్రాజెక్టుల కోసం ఇప్పటి నుంచే ‘కౌంట్ డౌన్’ ప్రారంభించాలని మంత్రి హరీష్ రావు సూచించారు. డెడ్ లైన్ పెట్టుకోకపోతే ఏ పనులూ సకాలంలో జరగవని ఆయన అభిప్రాయపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీలు, పంప్ హౌజ్ లు, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, తదితర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను మంత్రి సమీక్షించారు.
ఈ సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, సెక్రటరీ వికాస్ రాజ్, ఇ.ఎన్.సిలు మురళీధర్, విజయప్రకాష్, ‘కాడా ‘ కమిషనర్ డాక్టర్ మల్సూర్, ఓఎస్ డి శ్రీధర్ రావు దేశ పాండే, ఎత్తిపోతల పధకాల సలహాదారు పెంటా రెడ్డి, చీఫ్ ఇంజనీర్లు ఎన్.వెంకటేశ్వర్లు, బి. హరిరామ్, అనిల్, సునీల్, లింగరాజు, శంకర్, భగవంతరావు, ఖగేందర్ రావు, మధుసూదన్, పద్మారావు తదితర సి.ఇ, ఎస్.ఇలు పాల్గొన్నారు.