గజ్వేల్: అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో సత్ఫలితాలు ఇస్తున్నాయని రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్ అటవీ ప్రాంతంలో చేపట్టిన అడవుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించే ముందు ములుగు అటవీ కళాశాల, పరిశోధన కేంద్రంలోని సమావేశ హాల్ లో అడవుల పునరుద్ధరణ పనులను అటవీశాఖ పీసీసీఎఫ్ ఆర్.శోభ, పీసీసీఎఫ్ (SF) ఆర్.ఎం.డోబ్రియాల్ డిజిపి, పోలీస్ అధికారులుకు వివరించారు. అడవుల్లో ఉన్న రూట్ స్టాక్ ను ఉపయోగించుకొని అడవుల్లో సహజమైన పద్ధతిలో చెట్ల పెంపకం చేపట్టామన్నారు. అడవి చుట్టూ కందకాలు తీసామని, దీనివల్ల అడవికి రక్షణ ఏర్పడుతుందని బయటి జంతువులు లోపలకు రావడంగానీ, లోపలి జంతువులు బయటకు వెళ్లడం కానీ, సాధ్యం కాదన్నారు. ఆ కందకాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల చెట్లకు కావల్సిన తేమ అందుతుందని అన్నారు. కందకాల కట్టలపై గచ్చకాయ చెట్లు నాటడం వల్ల అడవికి సహజమైన రక్షణ ఏర్పడుతుందన్నారు. 30 రకాల పండ్ల చెట్లు కూడా అడవుల్లో పెంచుతున్నామని, దీనివల్ల గ్రామాలు, పట్టణాల్లోని కోతులు అడవికి వాపస్ పోతున్నాయని అటవీశాఖ అధికారులు చెప్పారు. అడవుల పునరుద్ధరణ వల్ల కాలుష్యం తగ్గుతుందని, ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని, వర్షపాతం పెరుగుతుందని, జీవ వైవిధ్యానికి అవకాశం కలుగుతుందని అటవీశాఖ అధికారులు పోలీస్ అధికారులకు చెప్పారు.డిజిపి మాట్లాడుతూ కేరళ, మెట్టుపలాయం (తమిళనాడు)మాదిరిగా కాలేజీ, యాదాద్రి నమూనా స్ఫూర్తిగా చేపట్టిన అటవీ పునరుద్ధరణ పనులు మెరుగైన ఫలితాలు వస్తున్నాయన్నారు. అటవీ విస్తీర్ణం , పచ్చదనం ప్రణాళిక బద్దంగా పెంచేందుకు అటవీ పరిశోధన సంస్థ ను ప్రభుత్వం స్థాపించిందన్నారు. అటవీ పరిశోధన స్థాపన వల్ల శాస్త్రీయంగా, వేగంగా అడవులను పునరుద్ధరణ జరుగుతుందన్నారు. ప్రభుత్వం , అటవీ శాఖలు నిబద్ధత తో అటవీ విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తున్నాయన్నారు.జిల్లా యంత్రాంగం అద్భుత సహకారం అందిస్తోందని డిజిపి కితాబునిచ్చారు.
జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి మాట్లాడుతూప్రజా ప్రతినిధులు, ప్రజా భాగస్వామ్యంతో జిల్లాలో పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలను ప్రణాళిక బద్దంగా చేపట్టామన్నారు. ఉపాధి హామీ నిధులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నామన్నారు. మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వడం దగ్గర నుంచి రెండు సంవత్సరాలు మొక్కల సంరక్షణ సైతం ఉపాధి హామీ నిధుల ను ఉపయోగించు కున్నామన్నారు. మొక్కల సంరక్షణ కు హరిత సైనికులను నియమించి.. అటవీ శాఖ ద్వారా శిక్షణ ఇచ్చామన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ అధికారులు అందరికీ పి సి సి ఎఫ్ ఆర్ శోభ అటవీ శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. అటవీ ప్రభావిత ప్రాంతాలలో స్మగ్లింగ్ నిరోధానికి అటవీ రక్షణకు, అటవీ సంబంధిత నేరాల అదుపునకు పోలీస్ శాఖ సహకారాన్ని కొనసాగించాలని ఆమె కోరారు.