తాడేపల్లి: అరకు ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
విశాఖపట్నం: అరకు ప్రమాద ఘటన బాధాకరమని, ఈ ఘటనపై కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. అరకు ఘాట్రోడ్ ప్రమాద ఘటనలో గాయపడి కేజీహెచ్ ఆస్పత్రిలో చేరిన బాధితులను మంత్రులు ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్ పరామర్శించారు. వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ నుంచి 27 మంది అరకు ప్రాంతానికి వచ్చారని, ప్రమాదంలో నలుగురు మృతి చెందారని మంత్రి తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. ప్రత్యేక అంబులెన్స్లో స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.