తాడేపల్లి: కరోనా వైరస్పై ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించి భౌతిక దూరంపై మరింత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విదేశాల్లో చిక్కుకున్న ఏపీకి చెందిన వారు రేపటి నుంచి వస్తారని సీఎంకు వివరించారు. ఎయిర్పోర్టుల నుంచి క్వారంటైన్ కేంద్రాలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతి వ్యక్తికి స్క్రీనింగ్ చేయాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా రాష్ట్రంలోకి వచ్చే చెక్పోస్టుల వద్ద నిబంధనలకు లోబడే అనుమతించాలన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారిని ప్రత్యేక యాప్ ద్వారా హోం క్వారంటైన్కు తరలిస్తున్నట్లు సీఎంకు అధికారులు వివరించారు. హోం క్వారంటైన్కు కొత్తగా వెళ్తున్న వ్యక్తుల సమాచారాన్ని ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, గ్రామ సచివాలయాలకు అందించాలని సీఎం ఆదేశించారు. క్వారంటైన్ సమయంలో కేంద్ర మార్గదర్శకాలను పాటించాలని సూచించారు.