శ్రీశైల దేవస్థానం: శ్రీశైలక్షేత్ర పరిధిలో పలువురికి కరోనా నిర్ధారణ కావడంతో కార్యనిర్వహణాధికారి ఈ రోజు 13 న అత్యవసరంగా దేవస్థాన అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులతో దూరశ్రవణ సమావేశం ( టెలికాన్ఫరెన్స్ ) నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో తహశీల్దార్ రాజేంద్రసింగ్, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డా. సోమశేఖర్, దేవస్థానం వైద్యులు డా. బాబుశివప్రకాశ్, దేవస్థాన పారిశుద్ధ్య, వైద్యవిభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ తగిన జాగ్రత్తలు పాటించడం వలన కరోనా – వ్యాప్తిని అరికట్టవచ్చునని, అందరు కూడా ధైర్యంగా ఉంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎవరికైనా పొడిదగ్గు, గొంతునొప్పి, జ్వరం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.స్థానికులందరు కొంతకాలం పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా వారి వారి రాకపోకలను వాయిదా వేసుకోవాలన్నారు. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి బంధువులు, సన్నిహితులు మొదలైన వారందరికి కూడా ప్రస్తుతానికి వారివారి ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని తెలియజేయడం మంచిదన్నారు. కాగా కరోనా నిర్ధారణ అయినవారి ఇళ్ల పరిసర వీధులన్నింటిని ఇప్పటికే శానిటైజేషన్ చేశామన్నారు. ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు పొందుతూ ఈ ప్రాంతాలలో పూర్తి శాస్త్రీయ పద్ధతిలో శానిటైజేషన్ కొనసాగిస్తుండాలన్నారు.సాధ్యమైనంత వరకు అందరు కూడా ఇళ్ళకే పరిమితం కావాలని, తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే బయటకు రావాలని సూచించారు. ముఖ్యంగా వయస్సు పైబడిన వారు, చిన్నపిల్లలు ఇంటిపట్టునే ఉండాలని సూచించారు.ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా ముఖానికి మాస్కు ధరిచండం, భౌతికదూరాన్ని పాటించడం, సబ్బు లేదా శానిటైజర్ లో ప్రతి 2 గంటలకు ఒకసారి 20 నుండి 40 సెకన్ల పాటు చేతులను శుభ్రపరుచుకోవడం లాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఇక బహిరంగ ప్రదేశాలలో ఉమ్మివేయడం లాంటివి చేయకూడదన్నారు. ముఖ్యంగా కళ్ళు, ముక్కు, నోటిని తరచుగా తాకకూడదన్నారు.అదేవిధంగా డోర్ హ్యాండిల్స్, రైలింగులను మొదలైన వాటిని తాకకుండా వుండడం ఎంతైనా అవసరమన్నారు. రహదారులలోనూ, ఆరుబయలు ప్రదేశాలలోనూ జనులు గుంపులుగా గుమికూడకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. కరోనా ముందు జాగ్రత్త చర్యల గురించి దేవస్థాన ప్రసార వ్యవస్థ ద్వారా విస్తృతంగా ప్రజలకు తెలియజెప్పాలని శ్రీశైలప్రభ సంపాదకుణ్ణి ఆదేశించారు. అలాగే వాహనం ద్వారా మొబైల్ అనౌన్స్ మెంట్ కూడా విస్తృతంగా చేయాలని దేవస్థాన భద్రతా అధికారిని ఆదేశించారు. అందరు ఆహారములో పప్పుదినుసులు, తాజా కూరగాయలు, పండ్లు వంటి బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. దీనివలన రోగనిరోధకశక్తి పెరుగుతుందన్నారు.ప్రతిరోజూ తులసీ ఆకులను నమిలిమింగడం మంచిదని, అదేవిధంగా వంటకాలలో అల్లం, నిమ్మకాయలు మొదలైన వాటిని వినియోగించాలన్నారు.ఎవరికివారు వారి ఇళ్ళవద్దనే వ్యాయామం, యోగా, ధ్యానం, ప్రాణాయామం లాంటివి ప్రతిరోజూ చేయాలని సూచించారు.ఎవరు కూడా అపోహాలకు లోనుకాకుండా ఒకరికొకరు సహకరించుకుంటూ ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు.
ఎవరికైనా ఇబ్బందికలిగినప్పుడు వెంటనే దేవస్థాన అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చునని తెలిపారు.