ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన తెలంగాణ రాష్ట్రానికి తగిన ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కోరారు.
రాష్ట్రంలో జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి శనివారం ఫోన్ ద్వారా కేంద్ర మంత్రికి వివరించారు. మౌలిక సదుపాయాలకు, పంటలకు జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో ముఖ్యమంత్రి సమీక్షించారు. అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన నివేదికను పరిశీలించారు. ఆ నివేదికను కేంద్రానికి అందిస్తామని, తగిన సహాయం చేయాలని సిఎం కోరారు.
కాగా, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజెందర్, ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదివారం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కు నివేదిక సమర్పించనున్నారు.