తిరుపతి, నవంబరు 18: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన బుధవారం రాత్రి అమ్మవారు కల్కి అలంకారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. ఆలయం వద్దగల వాహన మండపంలో రాత్రి 7 నుండి 8 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది.
అశ్వం వేగంగా పరిగెత్తే అందమైన జంతువు. అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి. అలమేలుమంగ అన్ని కోరికలను తీర్చడంలో ఒకే ఒక ఉపాయంగా, సౌభాగ్యంగా ఆర్ష వాఙ్మయం తెలియజేస్తోంది. పద్మావతీ శ్రీనివాసుల తొలిచూపు వేళ, ప్రణయవేళ, పరిణయవేళ సాక్షిగా అశ్వం నిలిచింది. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలుమంగ అశ్వవాహన సేవాభాగ్యాన్ని పొందుతున్న భక్తులకు కలిదోషాలను తొలగిస్తుంది.
వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్స్వామి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి దంపతులు, టిటిడి బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎమ్మెల్యే డా.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బోర్డు సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జెఈవో పి.బసంత్ కుమార్ దంపతులు, సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, సిఇ రమేష్రెడ్డి, అదనపు సివిఎస్వో శివకుమార్ రెడ్డి, విఎస్వో బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఏఈవో సుబ్రమణ్యం, కంకణభట్టార్ వేంపల్లి శ్రీనివాసులు, అలంకార భట్టార్ ఎం.జి.రామచంద్రన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.