*తెలంగాణ సాయుధ పోరాట యోధుడికి అరుదైన బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన మంత్రి కేటీఆర్*
“మా తాతయ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రజాకార్లకు వ్యతిరేకంగా బందూక్ పట్టుకొని పోరాడిన యోధుడు. ఆయన రాసిన ఆత్మకథను తన 88వ పుట్టిన రోజు అయిన 17 జూన్ నాడు ఆవిష్కరించి తాతయ్యను సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాం. మీరు ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారా” అంటూ నిధి రెడ్డి అనే 17 ఏళ్ల అమ్మాయి మంత్రి కేటీఆర్కు మే 4వ తేదీ నాడు రాత్రి 10:22 గంటలకు ట్విట్టర్ ద్వారా సందేశం పంపింది. సరిగ్గా రెండు నిముషాలు గడిచాయో లేదో మంత్రి కేటీఆర్ స్వయంగా జవాబు ఇచ్చాడు ఆ అమ్మాయికి.
“తప్పకుండా చేద్దాం. అలాంటి పోరాట యోధుడి కొరకు నేను మీ ఇంటికి వస్తాను” అని.
ఈ మెసేజ్ చదివిన నిధి రెడ్డి ఆనందానికి హద్దులు లేవు. కొద్దిసేపు తను ఇది కలా నిజమా నమ్మలేకపోయింది.
కొద్ది నిముషాల్లోనే పూర్తి వివరాలు పంపాలని కేటీఆర్ ఆఫీసు నుండి మరొక మెసేజ్ వచ్చింది నిధి రెడ్డికి.
కట్ చేస్తే…
ఇవ్వాళ జూన్ 17. హబ్సిగూడా లోని స్ట్రీట్ నెంబర్ 7లో ఉంటున్న తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మిట్ట యాదవ రెడ్డి ఇంటికి మంత్రి కేటీఆర్ స్వయంగా వెళ్లారు. నడవలేని దశలో ఎక్కువగా మంచంపైనే ఉంటున్న మిట్ట యాదవ రెడ్డి గారిని మంత్రి ఆప్యాయంగా పలకరించారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సత్కరించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక జ్ఞాపికను కూడా అందించారు. కుటుంబ సభ్యులందరి సమక్షంలో మిట్టయాదవ రెడ్డి కేక్ కట్ చేయగా, వారికి మంత్రి కేటీఆర్ కేక్ తినిపించారు. గతంలో అయన చేసిన కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ పోరాటాల్లో తాను నిర్వహించిన పాత్రను అయన మంత్రి వివరించారు. తదనంతరం యాదవ రెడ్డి గారు స్వయంగా రచించిన “నా జ్ఞాపకాలు” అనే ఆత్మకథను మంత్రులు జగదీశ్ రెడ్డి, కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మిట్ట యాదవ రెడ్డి మాట్లాడుతూ అనుక్షణం తాను తెలంగాణ కొరకే పరితపించానని, ఇవ్వాళ కేసీఆర్ సారధ్యంలో రాష్ట్రం సిద్ధించడం, అభివృద్ధిపథంలో నడవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ కూడా పరిశ్రమలు, ఐటీ రంగంలో అద్భుతంగా పనిచేస్తున్నారని యాదవరెడ్డి కితాబిచ్చారు. తెలంగాణ రాష్ట్రం సరైన దిశలో వెళ్తుందని, తెలంగాణ నాయకత్వంపైన అభినందనలు తెలిపారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మిట్ట యాదవ రెడ్డి వంటి యోధుల పోరాటమే భావి తరాలకు స్ఫూర్తి అన్నారు. మొక్కవోని దీక్షతో ఆయనలాంటి ఎందరో చేసిన పోరు ఫలితమే ఇవ్వాళ మనం శ్వాసిస్తున్న స్వేచ్చావాయువులు అని అన్నారు. చరిత్రను చూసిన యాదవ రెడ్డి లాంటి పెద్దవాళ్ల ప్రశంసలు తమను మరింత స్పూర్తితో ముందుకు నడుపుతాయన్నారు.
యాదవ రెడ్డి మనుమరాలు నిధి రెడ్డి మాట్లాడుతూ “కేటీఆర్ గారు ట్విట్టర్లో మెసేజ్ చేస్తే రెస్పాండ్ అవుతారని అందరూ అంటుంటే నేను కూడా ట్రై చేశాను. బట్, మంత్రి గారు నిజంగా స్పందించి, ఏకంగా మా ఇంటికే వస్తారని కలలో కూడా ఊహించలేదు. వారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు” అన్నారు. మిట్ట యాదవ రెడ్డి కుటుంబ సభ్యులు, మిత్రులు కూడా తనకున్న బిజీ షెడ్యూల్లో కూడా పుట్టిన రోజును గుర్తుంచుకుని మరీ తమకు అద్భుతమైన బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి కెటియార్ వెంట విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, మేయర్ బొంతు రాం మోహన్ కూడా ఉన్నారు. మిట్ట యాదవ రెడ్డి గారితో తన తండ్రి గారికి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పుసకాన్ని ఇంగ్లీషులోంచి తెలుగులోకి అనువాదం చేసిన అడెపు లక్ష్మీపతి, డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, మిట్ట నవీన్ కుమార్ రెడ్డి, మిట్ట కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మిట్ట యాదవ రెడ్డి నేపథ్యం:
జనగామ, సూర్యాపేట తాలూకాల సంగమ ప్రదేశం వెలిశాల గ్రామంలో జన్మించిన మిట్ట యాదవ రెడ్డి గారు 1945-47 మధ్యలో భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. 1947 ఆగస్టులో జాతీయ జెండా ను ఎగురవేశి, నైజాం కు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నందుకు అరెస్ట్ అయినారు. జైలు నుండి విడుదల అయిన వెంటనే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చేరి రజాకార్లకు వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరులో చేరాడు. జనవరి 1948లో తాటికొండ గ్రామం వద్ద రజాకార్లు, నైజాం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో పాల్గొన్నాడు. దాదాపు రెండు మూడువందల సాయుధ పోలిసులు, రజకార్లు మూకుమ్మడిగా దాడి చేయడంతో మిట్ట యాదవ రెడ్డి దళం వద్ద మందుగుండు అయిపోవడంతో అరెస్ట్ అయినాడు. రజాకర్లు, నైజాం పోలీసులు కలిసి యాదవ రెడ్డిని చిత్ర హింసల పాల్జేశారు. చర్మం వలిచి, సూదులతో గుచ్చినా దళం ఆచూకీ కానీ, తన తోటీ కామ్రేడ్ల వివరాలు కానీ చెప్పని ధీశాలి ఆయన. 1951లో జైలు నుండి విదుదల అయ్యి 1952 ఎన్నికల్లో సూర్యాపేట పీడీఎఫ్ అభ్యర్ధి ధర్మభిక్షం, నల్లగొండ పార్లమెంటు అభ్యర్ధి రావి నారాయణ రెడ్డిల విజయానికి కృషి చేశారు.
నైజాం పోలీసుల చిత్రహింసలు, జైలు జీవితం కారణంగా ఆరోగ్యం చెడిపోయినా అకుంఠిత దీక్షతో మధ్యలోనే ఆగిపోయిన చదువును కొనసాగించి ఆర్థికశాస్త్రంలో ఎమ్మే, పీహెచ్డి పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పనిచేశారు. సోషల్ సైన్సెస్ విభాగానికి డీన్గా పదవీ విరమణ చేసి హబ్సిగుడా లో నివాసం ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.