అయిదో రోజు పూర్ణాహుతి తో శ్రీశైలం వరుణ యాగం శాస్త్రోక్తంగా ముగిసింది. వర్షాలు సమృద్ధిగా కురిసి తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం సుభిక్షంగా ఉండాలన్నఆకాంక్షతో శ్రీశైల దేవస్థానం లో వరుణ యాగం ( కారీరీష్టి ) నిర్వహించారు . దేవాదాయ కమిషనర్ డా.పద్మ , ఈ ఓ శ్రీరామచంద్ర మూర్తి , దేవస్థానం ఇతర అధికారులు ,సిబ్బంది , భక్తులు హాజరయ్యారు. వేద పండితులు , ఋత్వికులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. యాగశాల వేద మయంగా మారింది . మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నూతన పట్టు వస్త్రం , వెదురు బియ్యం. ఖర్జూరాలు ,యాలకులు , లవంగాలు , జాజికాయ, జాపత్రి మొదలగు 21 రకాల సుగంధ ద్రవ్యాలు, కొబ్బరి కురిడీలు, మారేడు మొదలైన పలు రకాల ఫలాలు, ఆయా యాగ సంబంధిత హోమ ద్రవ్యాలను హోమ గుండంలో సమర్పించి పూర్ణాహుతి నిర్వహించారు. చివరగా మహాదాశీర్వచన కార్యక్రమం జరిపి అందరికి ప్రసాద వితరణ చేసారు.పాతాళగంగలో ఋశ్యశృంగ నిమజ్జనం చేసారు.
అంతకు ముందు శ్రీశైల వరుణ యాగం నాల్గో రోజు ప్రత్యేకంగా పలువురు ఋత్వికులు నల్ల వస్త్ర ధారణతో వరుణ యాగం నిర్వహించడం విశేషం.వరుణ యాగం మూడో రోజున యాగ శాలలో శాస్త్రోక్తంగా వరుణ యాగ కార్యక్రమాలను ఋత్వికులు నిర్వహించారు. ఉదయం యాగవేదికపై నెలకొల్పిన ఆవాహన కలశాలకు షోడశ ఉపచారాలతో పూజాదికాలు జరిపారు. యజ్ఞ కుండాలలో హవిస్సు సమర్పించి యాగ కార్యక్రమాలు నిర్వహించారు.
వర్షాలు సమృద్ధిగా కురిసి తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం సుభిక్షంగా ఉండాలన్నఆకాంక్షతో శ్రీశైల దేవస్థానం లో వరుణ యాగం ( కారీరీష్టి ) ప్రారంభమైంది. ఈ నెల రెండో తేదీ నుంచి ఆరో తేదీ వరకు వరుణ యాగం జరిపారు . ఇందుకు ఏర్పాట్లను ఈ ఓ , ఇతర అధికారులు పర్యవేక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు బ్రహ్మశ్రీ ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజి శర్మ వారి పర్యవేక్షణలో ఈ యాగం నిర్వహించారు . పలు ప్రాంతాలకు చెందిన ప్రసిద్ధులైన 55 మంది ఋత్వికులు ఇందులో పాల్గొన్నారు . ఆలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో యాగం సంప్రదాయ పరంగా నిర్వహించారని ఎడిటర్ డా. అనీల్ కుమార్ తెలిపారు. ప్రతిరోజు వేద పారాయణాలు, వరుణ జపాలు ,ఋష్యశృంగ జపాలు , మహా భారతంలోని విరాట పర్వ పారాయణాలు నిర్వహించారు. ఈ ఓ ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేసామని ఎడిటర్ తెలిపారు.
రెండో తేదీ ఉదయం ప్రారంభమైన యాగ సంబంధిత పూజాదికాలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ కమిషనర్ డా.పద్మ , దేవస్థానం ఈ ఓ., ఎ . శ్రీరామచంద్రమూర్తి, దేవాదాయ తిరుపతి మల్టిజోన్ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ శ్రీమతి భ్రమరాంబ , దేవాదాయ శాఖ కర్నూలు డివిజన్ డిప్యూటి కమిషనర్ దేముళ్ళు , ఇతర అధికారులు , సిబ్బంది ,భక్తులు పాల్గొన్నారు.ముందుగా అధికారులు , ఋత్వికులు యాగ ద్రవ్యాలతో ఆలయ ప్రవేశం చేసి శ్రీ స్వామి అమ్మ వారలకు పూజాదికాలు జరిపారు. మంగళ వాయిద్యాలతో యాగశాల ప్రవేశం చేసారు . యాగా సంకల్పం చేసారు. వివిధ నీటి వనరులలో నీరు పుష్కలంగా చేరాలని సంకల్పం చేసారు. ఈ యాగం ఘనంగా జరగాలని మహా గణపతి పూజ చేసారు. స్థల శుద్ధి, స్వస్తి పుణ్యహవచనం జరిపారు. రుత్వికులందరికి దీక్ష వస్త్రాలు సమర్పించారు. చతుర్వేద పారాయణాల అనంతరం వరుణ యాగం ప్రారంభమైంది. ముందు యాగ ద్రవ్యాలున్న అలంకార శకటానికి పూజ, వర్షించే మేఘపు రంగు పోలిన గుర్రానికి , పొట్టేలుకు జలప్రోక్షణ చేసి పూజదికాలు చేసారు.అయిదో రోజు పూర్ణాహుతి తో శ్రీశైలం వరుణ యాగం ముగిసింది. భక్తులు దేవస్థానం వారిని అభినందించారు.