ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి ప్రధాన నిర్ణయాలు : February 13th 2019.
‘అన్నదాత సుఖీభవ’ కింద ప్రతి రైతు కుటుంబానికీ రూ.10 వేలు :
• ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.10వేలు ఇవ్వాలని ప్రాధమికంగా నిర్ణయం. (కేంద్రం ఇచ్చేది కూడా కలిపి). ఖరీఫ్లో, రబీలో 2 దశలుగా ఒక్కో సీజన్ కు రూ.5వేల చొప్పున ఇస్తారు.
• కౌలు రైతులకు కూడా ఖరీఫ్ నుంచి ఇచ్చి ఆదుకునేలా మార్గదర్శకాలు.
• రాష్ట్రంలో మొత్తం 76.21 లక్షల కమతాలు ఉన్నాయి. 5 ఎకరాల కమతాల వారు 60 లక్షల మంది రైతులు ఉన్నారు.
• ఫిబ్రవరి చివరలోనే ‘అన్నదాత సుఖీభవ’ చెక్కుల పంపిణీ.
• రైతు రుణ మాఫీ చెల్లింపులు కూడా వెంటనే చేపట్టాలని నిర్ణయం.
• కుటుంబానికి రూ.10వేలు చొప్పున ఇవ్వడం ద్వారా రైతులకు మొత్తం రూ.7,621 కోట్ల లబ్ది కలుగుతుంది.
• కేంద్రం తన పథకంపై అనేక ఆంక్షలు పెట్టింది, 5ఎకరాల లోపు వారే అని కేంద్రం పేర్కొంది. పైగా 3 వాయిదాలలో ఇస్తోంది. కొందరికే ఇచ్చి మిగిలిన రైతులను వదిలేసింది. అలాకాకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ ఇవ్వాలని మంత్రిమండలిలో నిర్ణయం.
పేదలకు ఇళ్లపట్టాలు :
• 2014 జూన్ నుంచి 07.02.2019 వరకు 3,92,745 ఇళ్లపట్టాలు ఇచ్చాం. క్రమబద్దీకరణ కింద 71,221 (డ్వెల్లింగ్ యూనిట్స్) ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ప్రభుత్వ భూముల్లో 92,960 ఇళ్ల పట్టాలు పంపిణీకి సిద్దంగా ఉన్నాయి. క్రమబద్దీకరణ కింద మరో 5,074 ఇళ్ల పట్టాలు (డ్వెల్లింగ్ యూనిట్స్) పంపిణీకి సిద్దంగా ఉన్నాయి.
డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు :
• డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలన్న నిర్ణయంపై మంత్రిమండలిలో ఆమోదం.
• సిమ్ కార్డుతో పాటు 3ఏళ్లు కనెక్టివిటీ ఇచ్చేలా నిర్ణయం.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మండలి ఏర్పాటు :
• ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మండలి ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం. వ్యవసాయ, ఉద్యానవనాల విద్య క్రమబద్ధీకరణకు ఉద్దేశించి ఈ మండలి ఏర్పాటు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో తరహా ఈ మండలిని ఏర్పాటుచేస్తున్నారు.
• ఇకపై అగ్రికల్చర్, హార్టీకల్చర్ ప్రాక్టీషనర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లుకు మంత్రిమండలి ఆమోదం. వ్యవసాయ, హార్టీకల్చర్ ప్రాక్టీషనర్ల సర్వీసులను పర్యవేక్షించే వ్యవస్థ ఇప్పటివరకు లేదు.
• వ్యవసాయ విద్య మరింత నాణ్యత, నైపుణ్యత, సాంకేతికతతో కూడిన విధంగా చేయడానికి ఈ మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయం.
• వ్యవసాయ విద్యలో డిగ్రీ పూర్తి చేసిన వారి సర్టిఫికేట్లు పరిశీలించి నకిలీ సర్టిఫికేట్లను ఏరివేసే కార్యక్రమం కూడా మండలి చేపడుతుంది.
• వ్యవసాయ కోర్సులను నిర్వహించే కళాశాలలకు సరైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా సక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నారా లేదా సర్టిఫికేట్లు సక్రమంగా ఇస్తున్నారా లేదా తదితర అంశాలను తనిఖీ చేసే పూర్తి అధికారం వ్యవసాయ మండలికి ఉంటుంది. ఇది చట్టబద్ధత కల్గి ఉంటుంది.
• ప్రభుత్వ గుర్తింపు పొందే కళాశాలలను ఈ మండలి సిఫారసు చేస్తుంది.
• వ్యవసాయ ఉద్యాన విద్యలో ప్రమాణాలు మరింత పెరగడానికి కొత్తగా ఏర్పాటయ్యే మండలి ప్రత్యేక దృష్టిసారిస్తుంది.
పోలవరం DPR-2కు CWC ఆమోదంపై చర్చ:
• రివైజ్డ్ DPR పూర్తిగా ఆమోదించేలా చూడాలన్న సీఎం. చింతలపూడి ఎత్తిపోతల నుంచి నీటిని అందించడంపై చర్చ. ‘ఆస్తులు కల్పించాం, వాటిని ప్రజోపయోగం చేయాలి, నీటిని అందించడంపైనే దృష్టిపెట్టాలి. ప్రత్యామ్నాయాలను అద్యయనం చేయాలి’ అని ముఖ్యమంత్రి సూచన. అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సాగునీటి కొరత లేకుండా చేయాలని ఆదేశం.
కంటింజెన్సీ ఉద్యోగుల జీతాల పెంపు :
• పంచాయతీలలో కంటింజెన్సీ ఉద్యోగులకు జీతాల పెంపుపై నిర్ణయం.
DSC 1998 క్వాలిఫైడ్లకు శుభవార్త :
• 1998లో DSCలో క్వాలిఫైడ్ అయిన 36 మందిని సెకండరీ గ్రేడ్ టీచర్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని మంత్రిమండలి నిర్ణయం. దీంతో సుదీర్ఘంగా ఉన్న 1998 DSC పెండింగ్ డిమాండ్ పరిష్కారం అయినట్టే.
• అలాగే, 2008లో DED, BED అర్హతల విషయంలో అనర్హులై పెండింగ్లో ఉన్న వారికి కూడా కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించే విషయాన్ని పరిశీలించాలని నిర్ణయం.
స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు :
• 1983-96 మధ్యలో నియమితులైన స్పెషల్ టీచర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, భాషా పండితులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయం. వీరికి నెలకు రూ.398 కన్సాలిడేటెడ్గా చెల్లిస్తున్నారు.
మరో 22 ఆస్పత్రుల స్థాయి పెంపు :
31 ఆస్పత్రుల అప్గ్రెడేషన్, మిగిలిన 22 హాస్పటల్స్ అప్గ్రెడేషనుపై కేబినెట్ నిర్ణయం.
ఐఎఎస్, ఎన్టీవోలకు ఇళ్ల స్థలాలు :
• ఐఏఎస్ అధికారులు, ఎన్జీవోలు, ఉద్యోగులకు ఇళ్ల ప్లాట్ల అంశంపై కేబినెట్ నిర్ణయం.
పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు :
• శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం, తిరుపతి ఆధ్వర్యంలో 9 పశుసంవర్థక పాలిటెక్నిక్లు, 9 ఫిషరీస్ పాలిటెక్నిక్ల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం.
• ఒక్కో కళాశాలలో 50 సీట్లు ఉంటాయి. 2022కి నిపుణుల కొరత ఎక్కువయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కొత్తగా ఈ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం (2019-20) నుంచి ఈ కళాశాలలు ప్రారంభం అవుతాయి.
• గత సంవత్సరం జరిగిన కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఇప్పుడు కొత్తగా ఈ కళాశాలలను మంజూరు చేశారు.
• మూడు కళాశాలలకు నేరుగా అనుమతులు లభించగా, మరో 6 కళాశాలలకు షరతులతో కూడిన అనుమతి లభించింది.
ధర్మ పోరాట దీక్షపై దుష్ప్రచారం :
• ఢిల్లీ ధర్మపోరాట దీక్షకు చేసిన ఖర్చు (రైలుకు రూ.కోటీ 23 లక్షలు ప్లస్ ఏపీ భవన్లో అయ్యింది రూ. కోటీ 60 లక్షలు) మొత్తం రూ.2 కోట్ల 83 లక్షల ఖర్చుకు కేబినెట్ ఆమోదం.
• రూ.10 కోట్లు ఖర్చయ్యిందని దుష్ప్రచారం చేశారని మంత్రిమండలిలో చర్చ.
• ధర్మ పోరాట దీక్షకు వెచ్చించిన వ్యయానికి మంత్రిమండలి ఆమోదం. మనం రాష్ట్రం కోసం దీక్ష చేశాం.
భోగాపురం పరిహారం :
• భోగాపురం ఎయిర్ పోర్టుకు భూములు ఇచ్చినవారికి ఇవ్వాల్సిన దాంట్లో మిగిలింది రూ.5 లక్షలు కూడా చెల్లించాలని నిర్ణయం. దానికింద రూ.35 కోట్లు ఇవ్వాలని నిర్ణయం.
వక్కలిగ రిజర్వేషన్ల పరిధి చిత్తూరు వరకు పెంపు :
• బీసీ(బి)లో ఉన్న వక్కలిగ/కుంచటిగ సామాజిక వర్గం చిత్తూరు జిల్లాలో వున్న వారికి కూడా రిజర్వేషన్ వర్తింపు చేయాలని మంత్రిమండలి నిర్ణయం.
• రాష్ట్రంలో 5 లక్షల మందిగా ఉన్న వక్కలిగ/కుంచటిగ సామాజిక వర్గ జనాభా.
• ఎక్కువమంది అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతంలో ఉన్నారు.
లిడ్క్యాప్ ఇకపై సంక్షేమ పరిధిలో :
• ఇంత వరకు పరిశ్రమల శాఖలో వున్న లిడ్క్యాప్ ఇకపై సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ పరిధిలో పనిచేస్తుంది. దీనిపై మంత్రిమండలిలో నిర్ణయం.
పోస్టులు :
• సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) పరిధిలో ఉన్న సెంట్రల్ సెక్రటేరియట్ లైబ్రరీలో ఒక గెజిటెడ్ లైబ్రేరియన్ పోస్టు మంజూరు చేస్తూ మంత్రి మండలి నిర్ణయం
• 78 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులను మంజూరు చేస్తూ కేబినెట్ నిర్ణయం. వీటితో పాటు 9 మంది సీనియర్ అసిస్టెంట్స్, 28 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 28 మంది శాంప్లింగ్ అసిస్టెంట్ పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించాలని నిర్ణయం.
• ఆహార భద్రతా చట్టాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేయడానికి అధికారుల కొరత ఉండటం వలన ఈ నిర్ణయం తీసుకున్నాం.
డిక్సన్ టెక్నాలజీకి లీజుకు షెడ్లు :
• చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని వికృతమాల గ్రామంలో ఏర్పాటైన ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ -2లో డిక్సన్ టెక్నాలజీ ఎల్ఈడీ టీవీలు, సీసీ కెమెరాలు, డిజిటల్ వీడియో రికార్డర్స్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను తయారు చేయడానికి రెండు షెడ్లను లీజుపై ఇవ్వడానికి మంత్రిమండలి నిర్ణయం. ఒక్కో చదరపు అడుగుకు రూ.26 లీజు ధరకు 30 ఏళ్లు ఇవ్వడానికి కేబినెట్ నిర్ణయించింది. ఒక్కొక్క షెడ్డు విస్తీర్ణం 50.356 చదరపు అడుగులు.
భూ కేటాయింపులు :
• సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సిఈఎస్ఎస్) సంస్థకు అమరావతి కేపిటల్ సిటీ వెలుపల 10 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయం.
• గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం అన్నవరం గ్రామంలో 765/400 KV సబ్ స్టేషన్ ఏర్పాటుకు పవర్ గ్రిడ్ సదరన్ ఇంటర్ కనెక్టర్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్ లిమిటెడ్ కు 4.15 ఎకరాల భూమి మార్కెట్ ధర కింద ఇవ్వడానికి కేబినెట్ నిర్ణయం.
• తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి చెందిన 17.17 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయిస్తూ మంత్రి మండలి నిర్ణయం.
• విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మారుపల్లి గ్రామంలో 80 ఎకరాల ప్రభుత్వ భూమి ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి బదలాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం.
• చిత్తూరు జిల్లా బి. కొత్తకోట మండలం కోటవూరు, బయ్యప్పగారి పల్లె హార్టికల్చర్ రిసెర్చి స్టేషన్ ఏర్పాటు. ఇందుకోసం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి 88.89 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు. మార్కెట్ ధర ప్రకారం ఎకరా ఒక్కింటికి రూ.2,43,300 చెల్లించే షరతుపై కేటాయింపు.
• వైఎస్.ఆర్. కడప జిల్లా జమ్మలమడుగు మండలం అంబవరం గ్రామంలో ఎం.ఎస్.ఎం.ఇ పార్కు ఏర్పాటు. ఇందుకోసం 153.13 ఎకరాల ప్రభుత్వ భూమి ఉచితంగా కేటాయింపు.
• కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో ఇళ్ల నిర్మాణానికి, టౌన్ షిప్ అభివృద్ధికోసం కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (KUDA)కి 56.94 ఎకరాల భూమి కేటాయింపు. మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ. 10,81,804 చెల్లించే షరతకు లోబడి కేటాయించడానికి మంత్రిమండలి ఆమోదం.
• చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి గ్రామంలో వెంకట పద్మావతి ఎడ్యుకేషనల్ సొసైటీకి మెడికల్ కాలేజీ ఏర్పాటుకోసం 38.22 ఎకరాలకు ఇచ్చిన లీజు కాలపరిమితి మరో 3 ఏళ్లకు పొడిగింపు. నిర్ణయించిన లీజు సొమ్ములో బకాయి సొమ్ము చెల్లించే షరతుతో లీజు పొడిగింపు.
• ప్రభుత్వ రంగ చమురు సంస్థ POL ఔట్ లెట్ ఏర్పాటు చేసుకొనేందుకు చిత్తూరు జిల్లా తిరుపతిలో ఖాళీ స్థలం 606.07 చ.గ కేటాయిస్తూ తిరుపతి అర్బన్ ఎస్.పికి అనుమతి.
• చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో 496.24 ఎకరాల భూమి ఏపీ ఎయిర్ పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ&సీఈఓ కు ముందస్తు స్వాధీనం. (ఇందులో 433.84 ఎకరాల డి.కె.టి భూమి, శాంతిపురం మండలం సోనేగానిపల్లిలో 41.75 ఎకరాల ప్రభుత్వ భూమి, 20.65 ఎకరాల డి.కె.టి భూమి ముందస్తు స్వాధీనానికి జిల్లా కలెక్టరుకు అనుమతి)
• ఈరోజు వైకుంఠపురం ఎత్తిపోతలకు శంకుస్థాపనపై సీఎంకు అభినందనలు:
• 1954లో వైకుంఠపురం ఎత్తిపోతలకు గతంలో ఎప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులుగారి హయాంలో శంకుస్థాపన చేశారు. అప్పటినుంచి డెల్టా ప్రజల ఆకాంక్ష. దానిని ఈరోజు నెరవేర్చడంపై ఆయకట్టు రైతాంగంలో హర్షం. కేబినెట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అభినందిస్తూ తీర్మానం.