తిరుపతి: పదకొండు సంవత్సరాలుగా ఎన్నో కష్టనష్టాలను ఓర్చి నా అడుగులో అడుగు వేస్తున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అయిన గాయాలు నా గుండెకు తాకాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి ఉద్వేగంగా అన్నారు. తిరుపతి వేదికగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర శంఖారావం పూరించింది. తిరుపతి చిత్తూరు జిల్లా బూత్ కమిటీ సభ్యుల సభ ప్రతిపక్షనేత వైయస్ జగన్ అధ్యక్షతన జరిగింది. సభలో జననేత మాట్లాడుతూ.. ఎన్నికలు రాబోతున్నాయి. బూత్ కమిటీ సభ్యులకు దశా, దిశా నిర్దేశించాలని ఆహ్వానించాము,మిమ్మల్ని అందరినీ చూస్తుంటే అధర్మానికి, అన్యాయానికి ప్రతిరూపంగా నిలిచిన చంద్రబాబు ప్రభుత్వాన్ని, కౌరవ సామ్రాజ్యాన్ని వధించడానికి సిద్ధంగా ఉన్న పాండవ సైన్యంలా కనిపిస్తుంది. జరగబోయే ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరగబోయే పోరాటం. మోసానికి, విశ్వసనీయతకు మధ్య జరిగే యుద్ధం, ఎన్నికలు న్యాయానికి, అన్యాయానికి మధ్య జరిగే ఎన్నికలు, డబ్బుకు, ఆప్యాయతకు జరగబోయే ఎన్నికలు.
రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు పడిన కష్టాలు, బాధలు తెలుసు. కొందరు కేసులను భరించారు. అవమానాలను సహించారు. లాఠీ దెబ్బలు తిన్నారు. ఆస్తులు పోగొట్టుకున్నారు. కొందరు కుటుంబ సభ్యులను కూడా పోగొట్టుకున్న పరిస్థితి చూశాను. పదకొండు సంవత్సరాలుగా నా అడుగులో అడుగులు వేశారు. చంద్రబాబు పాలనలో పడరాని పాట్లు పడ్డారు. మీకు తగిలిన ప్రతీ గాయం నా గుండెకు కూడా తగిలింది. మీ బాగోగులన్నీ నేను చూసుకుంటానని హామీ ఇస్తున్నా. అండగా ఉంటానని భరోసా ఇస్తున్నా. అన్ని రకాలుగా మిమ్మల్ని పైకి తెచ్చుకుంటానని హామీ ఇస్తున్నాను. రాజకీయంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను అన్ని రకాలుగా మిమ్మల్ని పైకి తెచ్చుకునే బాధ్యత నేను తీసుకుంటా.
రాజకీయ పార్టీల్లో మామూలుగా కార్యకర్తలు అంటారు. కానీ మన పార్టీలో నేను మాత్రం మిమ్మల్ని నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నా.
మీ అందరి తరుఫున ఒక్కటే చెబుతున్నా. రేపు దేవుడు ఆశీర్వదించి ప్రజలందరి చల్లని దీవెనలతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన పాలనలో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలి. పాదయాత్ర దారిపొడవునా చూశా.. 3648 కిలోమీటర్ల పాదయాత్రలో రాష్ట్రంలో పాలన జరగడం లేదని తెలిసింది. ఇవాళ గ్రామంలో సంక్షేమ పథకాలు అందడం లేదు. ఈ పరిస్థితులు మారాలి. దేవుడు ఆశీర్వదించి మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందాలి.
కులం చూడొద్దు, మతం చూడొద్దు, ప్రాంతం, వర్గం చూడొద్దు, రాజకీయాలు చూడొద్దు, పార్టీలు కూడా చూడొద్దు.. ప్రతి సంక్షేమ పథకం ప్రతి పేదవాడికి అందాలి. అందించే కార్యక్రమంలో మీ అందరి పాత్ర కీలకంగా ఉంటుందని హామీ ఇస్తున్నా. ఎన్నికలు దగ్గరపడ్డాయి. మరో నెలలో షెడ్యుల్ రాబోతుంది. తరువాతి నెలకు ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి మీ అందరి భుజస్కంధాలపై గొప్ప బాధ్యత ఉంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఆ బాధ్యత మీరంతా సవ్యసాచులు అయితేనే అది జరుగుతుంది.
చంద్రబాబు పాలనలో పూర్వకాలంలో రాక్షసుల పేర్లు విన్నాం, మారీచుడు అనే రాక్షసుడి పేరు విన్నాం. మాయలు చేస్తాడు. మంత్రాలు చేస్తాడు. పలానా పని చేయొద్దు అని ఉంటే ఆ పని కూడా చేస్తాడు. అలాంటి రాక్షసుడిని తలపించేలా చంద్రబాబు ప్రవర్తన ఉంది. ఓటరు లిస్టుల్లో పేర్లు తొలగిస్తున్నారు. ఇప్పటికే ఆ పని మొదలు పెట్టారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని దొంగ సర్వేల ఆధారంగా గుర్తించి వారి ఓట్లను తొలగిస్తున్నారు. మరోవైపున అక్షరాల 59 లక్షల దొంగ ఓట్లు నమోదు చేసే కార్యక్రమం జరుగుతుంది.
ఇదే పెద్ద మనిషి చంద్రబాబు ఎన్నికలు వచ్చే సరికి ఈ పెద్ద మనిషి మూటలకు మూటలు డబ్బు సంచులు తీస్తున్నాడు, డబ్బుల పంపిణీ, ప్రలోభాలు, పోలీసుల చేత గుండాగిరి కూడా చేయిస్తాడు. ఎన్నికలు వచ్చే సరికి తనకు సంబంధించిన పచ్చమీడియా, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు ఆ రెండు పత్రికలు, ఆ టీవీ ఛానళ్లు కూడా మీకు తెలుసు. ఆ మీడియాను బయటకు తీసి, వాటితోనే కాకుండా లగడపాటితో దొంగ సర్వేలు కూడా చేయిస్తాడు. ఎన్నికలు మరో నాలుగు రోజులు ఉన్నాయనగా గంటకో డ్రామా కూడా మొదలుపెడతాడు. ఇవన్నీ రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం.
మొదటి సినిమాలో అన్ని మోసాలే
అప్పట్లో చంద్రబాబు మోడీ, పవన్లతో కలిసి ప్రచారంలో పాల్గొని అనేక హామీలు ఇచ్చారు. 2014లో చంద్రబాబు తీసిన మొదటి సినిమా తీసినప్పుడు ఒక నెల రోజులు ఆగండి..అన్నీ అయిపోతాయని, ఆయన వస్తున్నారని ప్రచారం చేశారు. జాబు రావాలటే బాబు రావాలన్నారు.ఇదిగో ఆయన వచ్చేస్తున్నారు. ఆయన రాగానే వ్యవసాయ రుణాలన్నీ మాఫి అయిపోతాయి. రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. రైతుల ఖర్చులపై 50 శాతం లాభం వచ్చేలా మద్దతు ధర కల్పిస్తామన్నారు. బెల్టు షాపులు రద్దు చేస్తామన్నారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫి చేస్తామన్నారు. ఉచితంగా విద్యనందిస్తానని మొదటి సినిమాలో చెప్పారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామన్నారు. ఇంటికో ఉద్యోగం అన్నారు. అది వచ్చే వరకు ప్రతి ఇంటికి రూ.2 వేల నిరుద్యోగ భృతి అన్నారు. ఏపీఎస్సీ ద్వారా ప్రతి ఏటా ఉద్యోగాల నోటిఫికేషన్, కాంట్రాక్ట్ఉద్యోగుల ఉద్యోగాలన్నీ క్రమబద్దీకరిస్తామన్నారు. రూ.2లకే 20 లీటర్ల మంచినీరు ఇస్తామన్నారు. ప్రత్యేక హోదా పదిహేనేళ్లు తెస్తామన్నారు. ఏ కులాన్ని వదిలిపెట్టకుండా డైలాగులు కొట్టారు. బోయలను ఎస్సీలుగా చేస్తామన్నారు. మత్స్యకారులను ఎస్టీలుగా చేరుస్తామన్నారు. గాండ్లు, పద్మశాలీలు, ఇలా ప్రతి కులానికి ఒక పేజీ కేటాయించారు. ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలో అని మేనిఫెస్టో రూపొందించారు. మూడేళ్లలో పోలవరం పూర్తి చేస్తామన్నారు. ఆపదలో ఉన్న మహిళ ఫోన్చేస్తే ఐదు నిమిషాల్లో కాపాడుతా అన్నారు. అన్ని ప్రధాన నగరాల చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. అద్భుతమైన రాజధాని కడుతామన్నారు. ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికల తరువాత ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయ్యారు. మిమ్మల్ని అడుతున్నాను..ఇవన్నీ కూడా గ్రామాల్లోకి వెళ్లి చంద్రబాబు సినిమా డైలాగులు ప్రజలకు వివరించండి.
ఎన్నిలకు ఆరు నెలల ముందు..మూడు నెలల కోసం
ఎన్నికలు అయిపోయిన తరువాత కొత్త స్టోరీ మొదలుపెట్టారు. కొత్త స్టోరీ ఏంటంటే..రాష్ట్రాని ఎలా దోచుకోవాలని మొదలుపెట్టారు. ప్రజలకు మంచి చేయడం మరిచిపోయాడు. ఆయన ఇచ్చిన మాటలు నెరవేర్చలేదు. మనం చూసింది ఏంటంటే..ఏ కాంట్రాక్ట్లో ఎంత దోచుకోవాలి. మట్టిని, ఇసుక, బొగ్గు, కరెంటు కొనుగోలును వదిలిపెట్టలేదు. రాజధాని భూములు, విశాఖ భూములు, గుడి భూములు, బడి భూములు వదిలిపెట్టలేదు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచేయడం చూశాం. గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీలు పెట్టి మాఫియా మొదలుపెట్టారు.
రెండో సినిమా ఈ మధ్య కాలంలోనే చూశాం. ఎన్నికలకు ఆరు నెలల ముందు ..మూడు నెలల కోసం ఇది చంద్రబాబు మొదలు పెట్టిన రెండో సినిమా. ఆయన తీస్తున్న డ్రామాలు, నాటకాలు ఈ సినిమాలో బాగా కనిపిస్తున్నాయి. నాలుగేళ్లు బీజేపీతోను, పవన్తో కలిసి రాష్ట్రాన్ని దోచేశారు. రెండో సినిమాలో వారితో పోరాటం చేస్తున్నట్లు చూపిస్తున్నారు. పోలవరం కట్టకుండానే జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటకముందే జాతికి అంకితం చేశారు. తానే ప్రత్యేక హోదాను తాకట్టు పెడుతారు. ఎవరైనా మాట్లాడితే జైల్లో పెట్టిస్తారు. కేసులు పెడతారు. కానీ ఎన్నికలకు ఆరు నెలల ముందు..మూడు నెలల కోసం చంద్రబాబు నల్ల చొక్కా వేసుకొని ధర్మ పోరాట దీక్షలు అంటూ డ్రామాలు మొదలు పెట్టారు. ఐదేళ్ల పాటు పొదుపు సంఘాల రుణాల మాఫి ఊసే ఎత్తరు. ఎన్నికలకు మూడు నెలల ముందు పసుపు–కుంకుమ అనే కొత్త డ్రామా మొదలుపెట్టారు. పొదుపు సంఘాలకు వడ్డీలతో సహా రూ.1400 కోట్లు ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.25000 కోట్లకు రుణాలు చేరాయి. తాను చేసిన తప్పును మాత్రం చంద్రబాబు ఒప్పుకోరు. పసుపు–కుంకుమ పేరుతో మళ్లీ మోసం చేసేందుకు ముందుకు వచ్చారు. మనం పెట్టుబడి మూలధనం ఇస్తామని చెబితే..చివరి బడ్జెట్ ఓటాన్అకౌంట్ బడ్జెట్..ఇది చంద్రబాబు హయాంలో రాని బడ్జెట్. ఈ బడ్జెట్లో రైతులకు రూ.5 వేల కోట్లు కేటాయిస్తున్నారు. ఇన్నాళ్లు రైతులకు రావాల్సింది ఏది ఇవ్వలేదు. జీతాలు, పింఛన్ల కోసం ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్లో రైతులకు మళ్లీ మోసం చేస్తూ రూ.5 వేల కోట్లు అంటూ దగా చేస్తున్నారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు కట్టని రాజధానిలో వేల ఎకరాల భూమిని అమ్ముకుంటున్నారు. బహుబలి సినిమా షెట్టింగ్ మాదిరిగా అదో రాజధాని అంటూ చెబుతారు. పిల్లలకు జాబులు ఇవ్వడం లేదు. నిరుద్యోగ భృతి ఇవ్వడు. ఎన్నికలకు మూడు నెలల ముందు కేవలం 3 లక్షల ఇళ్లకు రూ.1000 చెప్పున నిరుద్యోగ భృతి ఇస్తున్నారు.
చంద్రబాబు ఐదేళ్లు అవ్వాతాతలను పట్టించుకోలేదు. వారికి మంచి చేయాలనే ఆలోచనే రాలేదు. కానీ ఎన్నికలకు మూడు నెలలు ఉందనగా, పెన్షన్లు పెంచుతామని మనం అన్నాం కాబట్టి ఎన్నికలకు మూడు నెలల ముందు మాత్రం తానే రూ. 2 వేలు ఇస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నాడు. సినిమా–2లో డైలాగులు కొడుతున్నాడు. పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసిన జగన్, ప్రజల కష్టాలు విన్న జగన్, పాదయాత్రలో ఆటో డ్రైవర్లకు తోడుగా ఉన్నందుకు, వారి చొక్క వేసుకొని ప్రతి ఆటోకు, ట్రాక్టర్కు రోడ్డు ట్యాక్స్లు ఉండవు. రద్దు చేస్తాం అధికారంలోకి వచ్చిన తరువాత అని, ప్రతి ఆటోకు సంవత్సరానికి రూ. 10 వేలు ఇస్తామని మనం చెబితే, వారి కష్టాలు, బాధలు తెలియని చంద్రబాబు ఎన్నికలు మరో మూడు నెలలు ఉన్నాయనగా డ్రైవర్ల ఖాకీ చొక్క వేసుకొని ట్రాక్టర్లు, ఆటోలకు రోడ్డు ట్యాక్సీలు రద్దు అని చెబుతున్నాడు.
పాదయాత్ర జరగుతుండగా కార్పొరేషన్లు భ్రష్టుపట్టించిన పరిస్థితి చూసి చలించి జగన్ అనే నేను కార్పొరేషన్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని, ప్రతి కులానికి కార్పొరేషన్లు పెడతానని నేను చెబితే, ప్రతి కులంలో 45 ఏళ్లు నిండిన ప్రతి అక్కకు చేయూత పథకం ద్వారా తోడుగా ఉంటాం. రూ. 75 వేలు ఉచితంగా ఇస్తామని చెబితే ఈ చంద్రబాబు ఐదు సంవత్సరాలు పట్టించుకోడు. వెనుకబడిన కులాలకు కార్పొరేషన్లు ఇవ్వాలని, తోడుగా నిలబడాలనే ఆలోచన రాలేదు. ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయనగా ప్రతి కులానికి కార్పొరేషన్ అంట. జగన్ చెప్పాడు కాబట్టి కార్పొరేషన్ అంటూ ప్రకటిస్తున్నాడు. బీసీలకు సంబంధించి ఒక సదస్సు పెట్టి బీసీ డిక్లరేషన్ అని గొప్పలు చెబుతున్నాడు. 2013లో ఎన్నికలకు ముందు చేసిన బీసీ డిక్లరేషన్ గుర్తుకు రాదు. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రజలను మాయ చేసేందుకు పెట్టిన 119 హామీలు గుర్తుకు రావు. కానీ, ఎన్నికలకు మూడు నెలల సమయం ఉందనగా రాజమండ్రికి వెళ్లి బీసీల మీటింగ్ పెట్టి బీసీ డిక్లరేషన్ అంటూ మరో మోసం చేస్తున్నాడు. మూడు నెలల కోసం చంద్రబాబు తీస్తున్న ఎన్నికల సినిమా చూడండి.
అంగన్వాడీలకు, వీఆర్ఓలకు, ఆశ వర్కర్లకు, హోంగార్డులకు జీతాలు పెంచాలంటే మనసు రాదు. నాలుగున్నర సంవత్సరం మోసం చేశాడు. కానీ జగన్ పాదయాత్రలో మీ అందరి మొహంపై చిరునవ్వులు చూస్తాను, అధికారంలోకి వచ్చిన తరువాత జీతాలు పెంచుతానని వారికి హామీ ఇస్తే.. ఆ తరువాత చంద్రబాబు జగన్ చెప్పాడు కాబట్టి ఎన్నికల ముందు జీతాలు పెంచినట్లుగా డ్రామాలు ఆడుతున్నాడు. 57 నెలలు ఒక వ్యక్తి మన కడుపు మార్చి కేవలం మూడు నెలలు అన్నం పెడతానంటే ఆ మనిషిని ఏమనాలని మీ అందరినీ అడుగుతున్నా. ఈ మనిషిని అన్నా.. అనాలా.. లేక దున్న అనాలా మీరే ఆలోచన చేయాలి.
చంద్రబాబు వాగ్దానాలు ఎలా ఉంటాయంటే టూరింగ్ టాకీసుల ఎదుట వారానికి ఒకసారి వాల్పోస్టర్ మార్చినట్లుగా చంద్రబాబు వాగ్దానాలు ఉన్నాయి. కాపీ కొట్టేవాడిని కాపీ రాయుడు అంటాం. ఈ కాపీ రాయుడికి ఫస్ట్ క్లాస్లో పాసయ్యే విద్యార్థికి మధ్య తేడా చెబుతాను. 1983 ప్రాంతంలో ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ఎన్నికలకు ఏడు నెలల ముందు వచ్చారు. ఎన్టీఆర్ రూ. 2లకే కిలోబియ్యం అని ప్రకటించారు. ఆ ప్రకటన చేసిన వెంటనే ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని, అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయ్భాస్కర్రెడ్డి ఎన్నికల ఆరు నెలల ముందు రూ. 1.90కే బియ్యం ఇచ్చారు. కానీ ప్రజలు నాలుగున్నర సంవత్సరాలు మమ్మల్ని పట్టించుకోలేదు. ఎన్నికలు ఆరు నెలలు ఉన్నాయనగా.. అది కూడా ఎన్టీఆర్ చెప్పాడు కాబట్టే రూ. 1.90కే కిలో బియ్యం ఇచ్చావు నిన్ను నమ్మం అంటూ కాంగ్రెస్ను ఓడగొట్టారు. ఇదే తరహాలో కాపీ కొడుతున్న చంద్రబాబును చూస్తే మీకు ఏమనిపిస్తుంది. నాలుగున్నర సంవత్సరాలు చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు రాలేదు. ఎన్నికలు మూడు నెలలు ఉన్నాయనగా స్కీములు పెడుతున్నాడు. ఇలాంటి వ్యక్తిని చూస్తే నిన్ను నమ్మం బాబు అని ప్రజలకు అనిపిస్తుంది.
చంద్రబాబు మరో కొత్త సినిమా నిన్ననే తీశాడు. ఆరవ బడ్జెట్ తనది కాని బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాడు. తన హయాంలో రాని బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాడు. మూడు నెలల తరువాత ఎవరు ముఖ్యమంత్రి అనేది ప్రజలు, దేవుడు నిర్ణయిస్తారు. రూ. 2.26 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు. దేవుడి ఆశీర్వాదం, ప్రజల చల్లని దీవెనలతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మనం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కాపీ కొడితే ఎలా ఉంటుందో.. ఇంచుమించుగా అది కూడా సరిగ్గా కొట్టలేకుండా ఉన్న బడ్జెట్ కనిపిస్తుంది. కనీసం కాపీ కొట్టడం సరిగ్గా చేతగాని కాపీరాయుడి బడ్జెట్. చంద్రబాబు మూడు సినిమాల గురించి ప్రజలకు చెప్పింది. బూత్ కమిటీలుగా మనం ఉన్నాం. మన అతి ముఖ్యమైన బాధ్యత ఐదేళ్ల కిందట చంద్రబాబును నమ్మి మోసపోయాం. ఓట్లేసిన తరువాత చంద్రబాబు అన్నిరకాలుగా మనల్ని మోసం చేశాడు. సినిమాలు చూపించాడు. తరువాత మళ్లీ ఘరానా మోసం చేయడం కోసం మళ్లీ ఈ పెద్ద మనిషి ఓట్లు అడుగుతున్నాడు. ఆ కార్యక్రమంలో ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని లూటీ చేశాడు. ఆ డబ్బులోంచి కాస్త బయటకు తీసి బిస్కెట్ల మాదిరిగా పంచే కార్యక్రమం చేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిని నమ్మం గాక నమ్మం అనే సమయం వచ్చింది. ఇది ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాలి. అన్యాయమైన పాలన, మోసాలను ఎలా అరికట్టాలనే ఆలోచన కూడా మీరంతా చేయాలి.
ఎన్నికలు జరిగినప్పుడు పోరాడేది చంద్రబాబు ఒక్కడితోనే కాదు. చంద్రబాబు వెనుక ఉన్న పచ్చ మీడియాతో పోరాటం చేయాలి. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపిస్తారు. చంద్రబాబు పాలన గురించి అబ్బో.. అబ్బో అంటూ చూపిస్తారు. అన్యాయం, మోసాలతో పోరాటం చేయాల్సి వస్తుంది. మీరంతా అప్రమత్తం కావాలి. ఓటర్ల తొలగింపు కార్యక్రమాన్ని మొదట అరికట్టాలి. ఫాం– 6 ఎలా నింపాలో మీరంతా తెలుసుకున్నారు. ఓటర్లను తొలగించిన పరిస్థితి ఉంటే తీసేసిన ఓటును మళ్లీ నమోదు చేయాలి. దొంగ ఓట్లను తొలగించే కార్యక్రమం కూడా చేయాలి.
ఫిబ్రవరిలో షెడ్యుల్, మార్చి, ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి. రెండు నెలల కాలం అప్రమత్తంగా ఉండాలి. పచ్చ ఛానళ్లలో ప్రజలను మోసం చేసే కథలు, ఉన్నది లేనట్లుగా చూపించే కథనాలు వస్తాయి. వాటిని తిప్పికొట్టే కార్యక్రమం మనం చేయాలి. ఎన్నికల తేదీ నాడు బూత్ కమిటీ సభ్యులుగా ఉన్న మనం. 50 ఇళ్లకు ఒక సభ్యుడిగా ఉన్నాం. మనం బాధ్యత తీసుకున్న 35 ఇళ్లలోని ఓటర్లను ఓటు వేయించే వరకు తీసుకురావాలి. ఆ రోజు చంద్రబాబు ఓటును ప్రభావితం చేసేందుకు చూస్తాడు. డబ్బులకు లొంగిపోకుండా ఆ ఓటర్ను చైతన్యం చేసేలా జరగబోయే మంచి గురించి చెప్పి ఓటు వేయించాలి. అన్నా, అక్క, అమ్మా అంటూ ప్రతి ఓటర్ను చైతన్యపరచాలి.
డబ్బుల కోసం మోసపోవద్దని చెప్పాలి. అన్న ముఖ్యమంత్రి అవుతాడు. మన ప్రభుత్వం వస్తుంది. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు సంవత్సరానికి రూ. 15 వేలు చేతిలో పెడతాడు అన్న అని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయితే ప్రతి రైతు చేతిలో మే వచ్చే సరికి రూ. 12,500లు ఇస్తాడని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మన ఇళ్లలో 45 నిండిన ప్రతి అక్క ఎక్కడ ఉన్నా సరే. నాలుగేళ్లలో రూ. 75 వేలు ఉచితంగా అందిస్తాడు అన్న. వైయస్ఆర్ చేయూత రూపంలో అని చెప్పండి. బాబును నమ్మి మోసపోవద్దు అన్న ముఖ్యమంత్రి అవుతాడు అవ్వాతాతల ముఖంలో చిరునవ్వు చూస్తాడు. పెన్షన్ రూ. 3 వేలకు తీసుకెళ్తాడు అన్న అని చెప్పండి. అన్న ప్రకటించిన నవరత్నాలను చూడండి మన పిల్లలను అన్న ఇంజనీర్లుగా, డాక్టర్లుగా చేస్తాడు. అప్పులపాలు కాకుండా అన్న చదివిస్తాడని చెప్పండి.