స్టూడియో ఎన్ ఉద్యోగులకు న్యాయం జరిగేంతవరకు పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తామని టీయుడబ్ల్యుజె-ఐజేయు, హెచ్ యు జె నాయకులు హామీ ఇచ్చారు . నెలల తరబడి బకాయి ఉన్న వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్ ను చెల్లించాలనే డిమాండుతో విధులను బహిష్కరించి, రెండు రోజులుగా శాంతియుత నిరసనకు దిగిన స్టూడియో ఎన్ ఉద్యోగులను శనివారం టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ,
హెచ్ యు జె కార్యదర్శి శంకర్ గౌడ్ పరామర్శించి, తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఉద్యోగులనుద్దేశించి విరాహత్ అలీ మాట్లాడుతూ, ఉద్యోగుల
శ్రమ దోపిడీకి పాల్పడి, వారి కడుపు గొట్టేందుకు ప్రయత్నించే యాజమాన్యాలు ఏ స్థాయిలో ఉన్నా వారికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ప్రతి సమస్యకు పరిష్కారం వుంటుందని, మానసిక ఆందోళనకు గురికాకుండా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళి వాటిని పరిష్కరించుకోవాలని ఉద్యోగులకు విరాహత్ ధైర్యాన్ని అందించారు. తగు కార్యాచరణ కోసం ఉద్యోగుల సమన్వయ కమిటీని ఎన్నుకున్నారు.