హైదరాబాద్:దేశ సరిహద్దులకు సంబంధించిన అవగాహన దక్షిణాదిన తక్కువగా ఉంటుందని కేంద్ర హోమ్ శాఖ మాజీ కార్యదర్శి కె. పద్మనాభయ్య అన్నారు. సరిహద్దు బలగాల్లో కూడా ఇక్కడి వారి ప్రాతినిధ్యం తక్కువేనని అన్నారు. జర్నలిస్ట్, రచయిత్రి రెహాన తన పాత్రికేయ ప్రయాణ అనుభవాల పై రాసిన ‘సరిహద్దుల్లో’ పుస్తకాన్ని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు . పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దు పరిస్థితులను సమగ్రంగా వివరించిన ఈ పుస్తకాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు. ఒక ప్రాంతీయ మీడియాలో పని చేస్తూ దేశ సరిహద్దుల వరకు వెళ్ళటం, రిపోర్ట్ చేయటం స్ఫూర్తిదాయకమని తెలంగాణ మీడియా అకాడమి ఛైర్మన్ అల్లం నారాయణ అభినందించారు. ఒక మహిళగా అన్ని అవరోధాలను దాటి సరిహద్దుల్లోని ప్రజల, సిపాయిల జీవితాన్ని, వారి కష్ట సుఖాలను అక్షరీకరించటం అభినందనీయం అని సభకు అధ్యక్ష త వహించిన డా. కాత్యాయని విద్మహే అన్నారు . మీడియా సంస్థల్లో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందని, మహిళలను ప్రోత్సహిస్తే వారు అద్భుతాలు చేయగలరని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ చెప్పారు. భారత దేశం సరిహద్దులు, ముఖ్యంగా చైనా దేశ సరిహద్దుల్లోని పరిస్థితులను కవర్ చేయాలని భారత ప్రెస్ కౌన్సిల్ సభ్యులు దేవులపల్లి అమర్ సూచించారు. రచయిత్రి రెహాన సాహసాన్ని అభినందించారు సీనియర్ జర్నలిస్ట్ మంగు రాజగోపాల్. జమ్ము కాశ్మీర్ లో తాను చూసిన పరిస్థితులు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వలస పోయే తీరు తనను కదలించాయని, పుస్తక రచనకు అవే స్ఫూర్తి అని రచయిత్రి రెహాన వివరించారు. ఈ పుస్తకాన్ని దేవులపల్లి పబ్లికేషన్స్ ప్రచురించింది.