
శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అయిదో రోజు (08.03.2021) న శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. తరువాత యాగశాల లో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేసారు.
అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిగాయి.
ఈ సాయంకాలం ప్రదోష కాల పూజలు, జపానుషానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిగాయి.
రావణ వాహనసేవ:
ఈ బ్రహ్మోత్సవాలలో నిర్వహించే వాహనసేవలలో భాగంగా ఈ రోజు (08.03.2021) సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు రావణ వాహనసేవ ప్రత్యేక ఆకర్షణ.
ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు చేసారు. తరువాత శ్రీశైలక్షేత్ర ప్రధాన వీధులలో గ్రామోత్సవం మరో ఆనందం. కోలాటం, చెక్కభజన, రాజబటులవేషాలు, జాంజ్ పథక్, జానపద పగటి వేషాలు, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, తప్పెటచిందు బీరప్పడోలు, చెంచునృత్యం, నందికోలసేవ, ఢమరుకం, చితడలు, శంఖం, పిల్లన్నగ్రోవి తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేసారు.
రాష్ట్ర ప్రభుత్వంచే పట్టువస్త్రాల సమర్పణ:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ రోజు (08.03.2021) న రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలను సమర్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఆర్థికశాఖామాత్యులు బుగ్గన రాజేంద్రనాథ్ శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.
ఈ సమర్పణ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు శిల్పాచక్రపాణిరెడ్డి కూడా పాల్గొన్నారు.
కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి ఆలయ అధికారులు, అర్చకస్వాములు, వేదపండితులు తదితరులు మంత్రివర్యులకు, శాసనసభ్యులకు స్వాగతం పలికారు.
తరువాత ఆలయ రాజగోపురం వద్ద వస్త్ర సమర్పణ సంకల్పం పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం మంత్రి, శాసనసభ్యులు మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు.
ఎంతో చారిత్రక ప్రసిద్ధి పొందిన శ్రీశైలక్షేత్రంలో ఎందరో చక్రవర్తులు, రాజులు, రాజకుటుంబీకులు మొదలైన వారు ఆయా ఉత్సవ సందర్భాలలో శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించేవారని ప్రతీతి.
ఈ సంప్రదాయాన్ని అనుసరించే రాష్ట్ర ప్రభుత్వం ఏటా మహాశివరాత్రి, దసరా మహోత్సవాలలోనూ శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను అనవాయితీగా సమర్పిస్తోంది.
అన్నదాన విభాగానికి విరాళాలు:
దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణకు ఈ రోజు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరుకు చెందిన కాటూరి రాము, విజయ ఫుడ్ ప్రాడక్ట్ వారు వివిధ రకాల ఊరగాయలను విరాళంగా అందజేశారు.
ఈ ఊరగాయలను శ్రీశైల నియోజకవర్గ శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి చేతుల మీదుగా వీరు దేవస్థానానికి అందించారు.
ఈ ఊరగాయల విలువ రూ. 8,59,000/-లు ఉంటుందని దాత తెలియజేశారు.
మామిడి, నిమ్మ, గోంగూర, పండుమిరపకాయ, కాకర, టమోటా మొదలైన ఊరగాయలు అందజేసినవాటిలో ఉన్నాయి.
అదేవిధంగా కూరలలో వేసే కారంపొడి, పులిహోర పేస్ట్, పప్పుల పొడి, వేరుశనగపొడి మొదలైనవాటిని కూడా వీరు సమర్పించారు.
అన్నప్రసాదవితరణలో భక్తులకు వీటిని వడ్డించాలని ఈ సందర్భంగా దాత కోరారు. వీరికి దేవస్థానం తరుపున శేషవస్త్రం, శ్రీస్వామి అమ్మవార్ల జ్ఞాపిక, ప్రసాదాలు అందించారు.
కూరగాయల విరాళం:
దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణకు తాడిపత్రి వాస్తవ్యులు శంకరనాయుడు, మల్లికార్జున నాయుడు విరాళంగా కూరగాయలను అందజేశారు. సుమారు 32 వేల కేజీల పలు రకాల కూరగాయలను వీరు దేవస్థానానికి అందించారు.
• ఆలయ దక్షిణమాడవీధిలోని నిత్యకళారాధన వేదిక , పుష్కరిణి వేదిక , శివదీక్షా శిబిరాల వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
* Smt K. Venkata Ramana, Palakol, West Godavari donated Rs.1,00,001 For Annadhaanam scheme.
*
‘నయన రగడ – నమ:శివాయ రగడ:
ఆడియో సీడి. విడుదల:
శ్రీశైల మల్లికార్జునస్వామి స్తుతి అయిన ‘నయనరగడ – నమ:శివాయ రగడ’ ఆడియో సీడిని ఈ రోజు (08.03.2021)న ఆర్థికశాఖామాత్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శ్రీశైలనియోజకవర్గం శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి ఆవిష్కరించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదికపై ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
13వ శతాబ్దంలో శ్రీశైల మల్లికార్జునస్వామివార్లను స్తుతిస్తూ చక్రపాణి రంగనాథకవి ఈ రగడను రచించాడు.
దేవస్థానం సమర్పిస్తున్న ఈ సీడిని అజయ్ రావులపల్లి, యూ.ఎస్.ఏ వారు దేవస్థానానికి విరాళంగా అందజేశారు |
ప్రముఖ సినీ నేపథ్యగాయకులు నిహాల్ వీటికి సంగీతాన్ని సమకూర్చారు. అదేవిధంగా నిహాల్, ప్రణతి, శృతిక, లాస్యప్రియ, సాయిప్రియ గానం చేశారు, వినయ్, శ్రీధర్, ప్రణు సహగాయకులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామరావు మాట్లాడుతూ శ్రీశైల క్షేత్ర సంబంధి సాహిత్యానికి విస్తృత ప్రచారం కల్పించడంలో భాగంగా దేవస్థానం ఈ ఆడియో సీడీని రూపకల్పన చేసిందన్నారు.
బ్రహ్మోత్సవ సమయం లో మంత్రి, శ్రీశైల నియోజకవర్గ శాసనసభ్యులు ఈ ఆడియో సీడిని విడుదల చేయడం ఎంతో ఆనంద దాయకమన్నారు. ఈ ఆడియోసీడి వల్ల భక్తులందరు కూడా శ్రీశైలక్షేత్ర ప్రసిద్ధ సాహిత్యాన్ని తెలుసుకునే అవకాశం లభిస్తుందన్నారు.
నిర్మాతగా వ్యవహరించిన అజయ్ రావులపల్లికి, సంగీతాన్ని సమకూర్చడంతో పాటు గానాన్ని చేసిన నిహాల్ కు , ఇతర గాయనీగాయకులకు తమ ధన్యవాదాలను తెలియజేస్తున్నాన్నారు.చివరగా నిహాల్ని స్వామివార్ల శేషవస్త్రం, ప్రసాదం , జ్ఞాపికతో సత్కరించారు.
శ్రీశైలప్రభ కన్నడ మాసపత్రిక గౌరవ సహాయ సంపాదకులు వ్యవహరిస్తున్న జి. బలరామచార్య, కర్నూలు కార్యక్రమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.