
శ్రీశైల దేవస్థానం:త్రయోదశి సందర్భంగా లోక కల్యాణం కోసం ఈ రోజు (24.05.2021) న ఆలయప్రాంగణంలోని నందీశ్వరస్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలు జరిగాయి.
ప్రతి మంగళవారం , త్రయోదశి రోజున దేవస్థాన సేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం చేస్తున్నారు. ప్రదోషకాలంలో అనగా సాయంసంధ్యా సమయంలో ఈ విశేషపూజలు నిర్వహిస్తున్నారు.
ఈ విశేషార్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరిత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజికవర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని పఠించారు.అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకుమహాగణపతిపూజను జరిపారు.
ఆ తరువాత నందీశ్వరస్వామికి పంచామృతాలతోనూ, ద్రాక్ష, బత్తాయి, అరటి మొదలైన ఫలోదకాలతో హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం మరియు మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం చేసారు. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం జరిగింది.
పురుషసూక్తం, వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో ఈ విశేషాభిషేకాన్ని జరిపారు. తరువాత నందీశ్వరస్వామివారికి నూతనవస్త్ర సమర్పణ, విశేష పుష్పార్చనలు అనంతరం నానబెట్టిన శనగలు నందీశ్వరస్వామికి సమర్పించారు. చివరగా స్వామికి నివేదన జరిగింది.అర్చకస్వాములు కోవిడ్ నిబంధనలతో భౌతిక దూరాన్ని పాటిస్తూ నందీశ్వరస్వామికి ఈ విశేషార్చనలు నిర్వహించారు.