పరిశ్రమలకు సహకరిస్తాం
-సంపూర్ణ పారదర్శకతతో అనుమతులు
-అందుబాటులో భూమి.. నిపుణులైన ఉద్యోగులు
-పీ అండ్ జీ ఇండియా ప్లానింగ్ సర్వీసింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ విశ్వనగరంగా ఎదుగుతున్నదని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో హైదరాబాద్ పెద్ద ఆర్థిక వనరుల కేంద్రంగా మారనున్నదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల తెలియజేసిందని గుర్తు చేశారు. మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో పీ అండ్ జీ పరిశ్రమ నెలకొల్పిన ఇండియా ప్లానింగ్ సర్వీసింగ్ సెంటర్ను గురువారం ప్రారంభించారు. అనంతరం పరిశ్రమ ఆవరణలో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ బహుళజాతి పరిశ్రమల ఏర్పాటుకు హైదరాబాద్ శివారు ప్రాంతం ఎంతో అనుకూలమైనదని తెలిపారు. ఈ ప్రాంతం ఎంతో సురక్షితమని, రవాణా సౌకర్యం కూడా ఉన్నదని చెప్పారు. నూతన పరిశ్రమలకు కావల్సిన భూమి అందుబాటులో ఉంచామని, పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అన్నారు. పరిశ్రమలకు అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ పారదర్శకతతో వ్యవహరిస్తున్నదనే విషయాన్ని గ్రహించాలని కోరారు.
ప్రభుత్వ పనితీరుతో బహుళ జాతి సంస్థలు తెలంగాణలో తమ ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యంగల ఉద్యోగులను అందించే సత్తా తెలంగాణ ప్రభుత్వం వద్ద ఉన్నదన్నారు. వెనుకడిన మహబూబ్నగర్ జిల్లాలో పీ అండ్జీ వంటి బహుళజాతి సంస్ధ పరిశ్రమను నెలకొల్పడం, ఉత్పత్తులకు సంబంధించిన ప్లానింగ్ సర్వీసింగ్ సెంటర్ను ప్రారంభించడం సంతోషకరమన్నారు. పరిశ్రమల విస్తరణ వల్ల స్థానికంగా ఉపాధి పెరుగడమే కాకుండా, ప్రభుత్వానికి కూడా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. సంస్థ మరిన్ని పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తే ప్రభుత్వ పరమైన సహాయ, సహకారాలు అందిస్తామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు జితేందర్రెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్యే వై అంజయ్యయాదవ్, పీఅండ్జీ పరిశ్రమ ఇండియా సీఈవో ఏఎల్ రజ్వాని, పరిశ్రమలశాఖ రాష్ట్ర కార్యదర్శి అరవింద్కుమార్ పాల్గొన్నారు.