
తిరుమల, 2021 ఫిబ్రవరి 12: పవిత్రమైన మాఘమాసం సందర్బంగా శుక్రవారం ఉదయం మాఘ పురాణ ప్రవచనం తిరుమల నాద నీరాజన వేదిక మీద ప్రారంభమైంది . ఈ కార్యక్రమం మార్చి 13వ తేదీ దాకా రోజు ఉదయం 6 నుంచి 6-45 గంటల వరకు నిర్వహిస్తారు.
ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతి ప్రదమైనదని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం సంస్కృత అధ్యాపకులు చలపతి తెలిపారు. హిందూ సంప్రదాయం ప్రకారం మాఘమాసం లో నదీస్నానం చేసి, శ్రీమన్నారాయణుని పూజించి, శక్తికొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుందన్నారు. మాఘమాసంలో ఏ నది నీరైననూ గంగానదితో సమానమని, ఈ మాసంలో నదీస్నానం సర్వపాపాలను హరిస్తుందన్నారు.
ఇందులో మాఘమాసం కథలు, శ్రీ పంచమి, రథసప్తమి, భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, మహశివరాత్రి పర్వదినాలు, రోజుకు ఒక విశేషమైన స్తోత్రం శ్రవణం చేస్తూ, స్వామిని ధ్యానించినట్లయితే లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో అందరూ ఆయురారోగ్యాలతో, సమస్త సిరి సంపదలతో, ధన, దాన్యాదులతో సుఖ మయ జీవితాన్ని పొందుతారన్నారు.
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కుప్పా శివసుబ్రమణ్య అవధాని ఆధ్వర్యంలో మాఘ పురాణ ప్రవచనం కార్యక్రమం నెల రోజుల పాటు టిటిడి నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి రోజు ఉదయం ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.