తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె.టి. రామారావు మరోసారి ట్విట్టర్ వేదికగా ప్రజలతో సంభాషణ
- ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్దం, జమిలి ఎన్నికలకు ఓకే
- 2019లో సిరిసిల్లా నుంచే పోటీ
- వచ్చే ఎన్నికల్లో నల్లగొండలో అన్ని స్ధానాల్లో గెలుస్తాం
- బీజేపీ , మోది ప్రభుత్వం పనితీరుపైన సంతృప్తిగా ఉన్నారా అంటే లేదు అని సమాధానం
- ప్రజలు లెప్ట్ పార్టీలను ఎప్పుడో వదిలేసారని మరో ప్రశ్నకు బదులు
- నచ్చే రాజకీయ నాయకులు సీఎం కేసీఆర్, బరాక్ ఒబామా అన్న మంత్రి
- నచ్చే అటగాళ్లు సచిన్, ద్రావిడ్, ఫెదరర్.
- తన పుట్టిన రోజున కేకులు, పోస్టర్లు కాకుండా మొక్కలు నాటాలని విజ్ఝప్తి
తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిరామారావు మరోసారి ట్విట్టర్ వేదికగా ప్రజలతో సంభాషించారు. అదివారం #Askktr పేరుతో సూమారు గంట ఇరవై నిముషాలపాటు సాగిన ట్విట్టర్ సంభాషణలో అనేక విషయాలపైన మంత్రి సమాధానాలు, అభిప్రాయాలు వెలిబుచ్చారు.
ఈ డిసెంబర్లోగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని మీకు అనిపిస్తోందా? అందుకు సిద్ధంగా ఉన్నారా? అని అడిగితే ఎన్నకలు ఎప్పుడు జరిగినా మేం సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. జమిలి ఎన్నికలను స్వాగతిస్తామన్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో మీరు ఏపీ నుంచి పోటీచేయాలని నాలాంటి చాలా మంది యువకులు కోరుకుంటున్నారు. మీరేమంటారు? అంటే భవిష్యత్తులో ఏం జరుగుతోందో ఎవరికి తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో జూబ్లీహిల్స్, శేర్లింగంపల్లి నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారా? అంటే సిరిసిల్ల ప్రజలు నన్ను మూడుసార్లు గెలిపించారు. వారి నమ్మకానికి కట్టుబడి ఉంటానన్నారు. బిజెపి, మోడి ప్రభుత్వం పనితీరుపైన సంతృప్తిగా ఉన్నారా అంటే లేదు అని సమాధానం ఇచ్చారు. ప్రజలు లెప్ట్ పార్టీలను ఎప్పుడో వదిలేసారని మరో ప్రశ్నకు బదులిచ్చారు. తర్వాతి తెలంగాణ సీఎం కూడా కేసీఆర్ గారే అంటూ సమాధానం ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో అన్ని స్ధానాలు గెలుస్తామన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తాజాగా తెలంగాణ పోలీసు చేసిన నగర బహిష్కరణలపై స్పందించారు. గత నాలుగేళ్లుగా తెలంగాణ ప్రభుత్వ విధానాలు దేశంలోని ఇతర ప్రాంతాలకు మార్గదర్శిగా నిలిచాయని తెలిపారు. రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని దేశంలో చేపట్టలేదన్నారు.
ఇష్టమైన క్రికెటర్ ఎవరు? ధోనీనా, కోహ్లీనా? అంటే రాహుల్ ద్రావిడ్, సచిన్ తెందుల్కర్. నేను వారి తరం నుంచే వచ్చాను అన్న మంత్రి ఇష్టమైన ఫుట్ బాలర్ లయెనల్ మెస్సి అని, ఫెదరర్ ఇష్టమైన టెన్నిస్ అటగాడని తెలిపారు. బరాక్ ఒబామా నచ్చే రాజకీయ నేత అన్నారు. నిజాం కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు కదా? మీకెలా అనిపిస్తోందంటే నిజాం కాలేజీ అద్భుతమైన కాలేజ్ అన్నారు. భారత బలమంతా యువతేనని , తన పుట్టిన రోజున కేకులు, పోస్టర్లు కాకుండా మొక్కలు నాటాలని విజ్ఝప్తి చేశారు.